బీహార్ పాలిటిక్స్లో మరో ట్విస్ట్-తేజస్వీని సీఎం చేస్తే ప్రధానిగా నితీశ్- ఆర్జేడీ ప్రతిపాదన
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యం సాధించి సీఎం పదవి చేపట్టిన నితీశ్ కుమార్కు ఆ సంతోషం ఎంతకాలం నిలిచేలా కనిపించడం లేదు. ప్రస్తుతానికి సీఎంగా నితీశ్కు మద్దతిస్తున్న బీజేపీ... ఏ క్షణాన అయినా ఆ కుర్చీ లాగేస్తుందనే అనుమానాలు మొదలయ్యాయి. నితీశ్తో స్నేహంగా ఉంటూనే అరుణాచల్ ప్రదేశ్లో అవసరం లేకపోయినా ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీపై ఆగ్రహంగా ఉన్న నితీశ్కు తాజాగా ఆర్జేడీ ఓ ఆఫర్ ఇచ్చింది.
మిత్రపక్షంగా ఉంటూ వెన్నుపోటు పొడిచిన బీజేపీతో తెగదెంపులు చేసుకుని మహాకూటమితో చేతులు కలపాలని ఆర్జేడీ నితీశ్ కుమార్ను కోరంది. తమ నేత తేజస్వి యాదవ్ను సీఎం చేయాలని, అలా చేస్తే ప్రధాని పదవికి నితీశ్కుమార్కు మద్దతు కూడగడతామని ప్రకటించింది. ఆర్జేడీ ఓసారి నితీశ్ను సీఎం చేసిందని, ఇప్పుడు ఆయన పెద్ద మనసు చేసుకుని తేజస్విని సీఎం చేయాలని ఆర్జేడీ నేత ఉదయ్ నారాయణ్ చౌదరి టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వూలో కోరారు.
నితీశ్ కుమార్ కేంద్రంలో రాజకీయాలపై దృష్టిసారించాలని, ఆయన్ను ప్రధాని చేసేందుక తాము సహకరిస్తామని ఉదయ్ నారాయణ్ చెప్పారు. ఎన్డీయే, బీజేపీ ఏకపక్ష వైఖరితో ప్రాంతీయ పార్టీలన్నీ ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీజేపీ పెద్ద చేప అని చిన్న చేపల్లాంటి ప్రాంతీయ పార్టీలను అది మింగేస్తుందని, అందుకే శివసేన కూడా ఎన్డీయే నుంచి తప్పుకుందని తెలిపారు. ఇప్పుడు జేడీయూకు కూడా సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీతో కేబినెట్ విస్తరణ సహా పలు అంశాల్లో జేడీయూకు విభేధాలు ఉన్నాయని, ఆయన ఎన్డీయేను వీడి మహాకూటమితో కలిసే సమయం వచ్చిందన్నారు.