కరోనాపై పోరులో మోదీ కొత్త ఐడియా.. కేంద్రం రూల్స్ను పక్కనపెడుతూ.. ఇకపై వాళ్లు జనంలోకి..
చైనాలో వైరస్ విజృంభణ మొదలైనప్పటి నుంచీ ప్రపంచ మంతటా 'కరోనా'నే హాట్ టాపిక్ గా కొనసాగుతున్నది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ లో లాక్ డౌన్ ప్రకటనకు ముందు, ఆ తర్వాత కూడా ప్రభుత్వం, మీడియా, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. కరోనా ఎలా పుట్టిందో.. ఎలా వ్యాపిస్తుందో.. ఎంటి ప్రమాదాలు కొనితెస్తుందో దాదాపు అందరికీ తెలిసింది. అయినాసరే... ప్రజల్లో తెలియని భయం.. వైరస్ పేరు చెబితేనే వణికిపోయే పరిస్థితి. అలాగని లాక్ డౌన్ రూల్స్ పాటిస్తున్నారా అంటే అదీ లేదు. దీంతో ప్రధాని మోదీ కరోనాపై పోరాటంలో సరికొత్త ఐడియాను ముందుకుతీసుకొచ్చారు.
తెరపైకి ఆ ఇద్దరు..
మన దేశంలో తొలి కరోనా కేసు నమోదైన కొద్ది సేపటికే కేంద్రం ఒక స్పష్టమైన ఆదేశాన్ని వెలువరించింది. కరోనా బాధితులుగానీ, పేషెంట్లు పేర్లుగానీ బయటికి వెల్లడించడానికి వీల్లేదని, చికిత్స అనంతరం కూడా వాళ్ల వివరాలపై గోప్యత పాటించాలని, ఈ నిబంధనల్ని మీరడాన్ని నేరంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఆ మేరకు ఇప్పటిదాకా వైరస్ బారిన పడ్డవాళ్ల సంఖ్య తప్ప వాళ్లు ఎవరనే విషయం ఎక్కడా వెల్లడికాలేదు. కానీ వైరస్ పట్ల ప్రజల్లో ఇప్పటికీ భయాందోళలు కొనసాగుతుండటంతో వాటిని దూరం చేసేందుకు మోదీ ఏకంగా కరోనా బాధితులనే తెరపైకి తేవడం గమనార్హం.
రాంతేజ.. అమిత్ కపూర్..
ఆదివారం ప్రధాని మోదీ నిర్వహించిన ‘మన్ కీ బాత్' కార్యక్రమంలో కొవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల్ని ప్రంపంచానికి పరిచయం చేశారు. వైరస్ పై యుద్ధం చేసి, దాన్నుంచి పూర్తిగా కోలుకున్న యోధులు అంటూ.. హైదరాబాద్ కు చెందిన రాంతేజ, ఆగ్రాకు చెందిన అమిత్ కపూర్ లను ప్రధాని కీర్తించారు. వాళ్లతో జరిపిన ఫోన్ సంభాషణను ప్రధాని అందరికీ వినిపించారు.
గాథను పంచుకోండని పిలుపు..
కరోనా బారినపడి, ఆ విషయాన్ని సకాలంలో స్థానిక ప్రభుత్వానికి తెలియజేసి, వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుని, పూర్తిగా కోలుకున్నందుకు తేజ, అమిత్ లను మోదీ అభినందించారు. ‘‘మీ విజయగాథను అందరితో పంచుకోండి.. తద్వారా ప్రజల్లో స్ఫూర్తి నింపండి''అని సూచించారు. ప్రధానితో సంభాషణ తర్వాత చాలా ఉత్సాహం వచ్చిందని, ఇకపై జనంలోకి వెళ్లి వైరస్ పై అవగాహన కల్పిస్తూ, భయాలను దూరం చేసే ప్రయత్నం చేస్తానని అమిత్ కపూర్ మీడియాకు చెప్పారు. సికింద్రాబాద్ కు చెందిన రాంతేజ కూడా తన గాథతో నలుగురికీ అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు.
ఉల్లంఘనులపై ఆగ్రహం..
కరోనా వారియర్స్ తేజ, అమిత్ లతోపాటు వైరస్ పై అలుపెరగని పోరాటం చేస్తోన్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని కూడా మోదీ అభినందించారు. అదేసమయంలో.. క్వారంటైన్ లో రూల్స్ ఉల్లంఘిస్తూ కొందరు ఇష్టారీతిగా తిరుగుతున్నవాళ్లను, లాక్ డౌన్ ఉన్నా రోడ్లపైకి వస్తున్న జనంపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సడెన్ గా లాక్ డౌన్ ప్రకటించినందుకు క్షమాపణలు చెబుతూనే, అది తప్పనిసరి నిర్ణయమని, ప్రజలంతా సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే వైరస్ ను జయించొచ్చని మోదీ అన్నారు.