‘బ్రహ్మచారి’ తాతయ్య ఇక లేరు -మలయాళ నటుడు ఉన్నికృష్ణన్ నంబూద్రి కన్నుమూత
కొత్త ఏడాది తొలి మాసంలోనూ సినీ రంగంలో విషాదాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే టాలీవుడ్, కోలీవుడ్ రచయిత వెన్నెలకంటి, నిర్మాత దొరస్వామి రాజు మరణాలు సంభవించగా.. ఇప్పుడు మాలీవుడ్ కు చెందిన మరో సీనియర్ నటుడు కన్నుమూసారు. కమలహాసన్ నటించిన 'బ్రహ్మచారి' సినిమాలో..
బోసి నవ్వుల తాతయ్యగా అందరినీ ఆకట్టుకున్న మలయాళ సీనియర్ నటుడు ఉన్నికృష్ణన్ నంబూద్రి అనారోగ్యంతో బుధవారం మరణించారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. కొన్ని రోజులుగా వయోభారంతో ఇబ్బంది పడుతున్నఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
జయరాజ్ దేశదనం చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఉన్నికృష్ణన్.. తర్వాతికాలంలో మలయాళంలో వన్ మ్యాన్, కలియట్టం, కైకుదన్న నీలవ్లతో సహా 15కి పైగా చిత్రాల్లో నటించారు. మలయాళమే కాకుండా తమిళ సినిమాలలో కూడా నటించారు. కండుకొండైన్ కండుకొండైన్, పమల్ కె సమ్మంధం, చంద్రముఖి లాంటి సినిమాలలో కనిపించారు. వెటరన్ మృతికి మలయాళ, తమిళ సినిమా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.