ఆ ఒక్క నిమిషం మైండ్ బ్లాంక్.. మాల్లో నటికి లైంగిక వేధింపులు.. అసభ్యంగా తాకి...
కుటుంబ సభ్యులతో కలిసి ఓ మాల్కి వెళ్లిన మలయాళ నటికి చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు వ్యక్తులు ఆమెను అసభ్యంగా తాకి వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. తన పట్ల ఇంత నీచంగా వ్యవహరించినవారి చెంప పగలగొట్టలేకపోయానన్న నిస్సహాయత తనను వెంటాడుతున్నట్లు చెప్పింది. ఆడపిల్లగా బతకడమంటే ప్రతీ క్షణం ఒక సవాల్గా మారిందని అభిప్రాయపడింది. కొచ్చిలో జరిగిన ఈ ఘటనపై స్పందించిన కేరళ మహిళా కమిషన్ దీన్ని సుమోటో కేసుగా స్వీకరించింది.
ఒక్క నిమిషం మైండ్ బ్లాంక్...
'కుటుంబ సభ్యులతో కలిసి మా ఇంటి సమీపంలో ఉన్న లులు హైపర్ మార్కెట్కి వెళ్లాను. మాల్లో వస్తువులు తీసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు నాకు సమీపం నుంచి వెళ్లారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి చేయి నా వెనుక భాగంపై తగిలింది. ఉద్దేశపూర్వకంగానే అతనలా చేశాడు. దీంతో ఒక నిమిషం పాటు నేను బ్లాంక్ అయిపోయాను. ఇంతలో నా సోదరి వచ్చి అంతా ఓకెనా అని అడిగింది. ఏం చెప్పాలో తెలియలేదు. అతను నన్నలా తాకడం దూరం నుంచి నా సోదరి కూడా చూసింది. ఉద్దేశపూర్వకంగానే అతనలా చేసినట్లు ఆమెకు కూడా అనిపించింది.' అని సదరు నటి సోషల్ మీడియాలో వెల్లడించింది.
చెంప పగలగొట్టలేకపోయానన్న బాధ...
'ఆ తర్వాత వెజిటేబుల్ కౌంటర్ వద్దకు వెళ్లగా... అదే ఇద్దరు వ్యక్తులు మళ్లీ అక్కడికి వచ్చారు. నేను నటిస్తున్న సినిమాల గురించి అడగాడు. మాట్లాడుతూనే పైపైకి వచ్చాడు. దీంతో మైండ్ యువర్ బిజినెస్ అని చెప్పి అక్కడినుంచి వెనుదిరిగాను. ఇంతలో మా అమ్మ అటువైపు రాగా.. ఆ ఇద్దరూ అక్కడినుంచి జారుకున్నారు.' అని ఇన్స్టాగ్రామ్లో తెలిపారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ ఇద్దరి చెంప పగలగొట్టనందుకు,వారిని కనీసం ఏమీ అనలేకపోయినందుకు తనలో తానే బాధపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
సుమోటో కేసు...
కేరళ మహిళా కమిషన్ ఛైర్మన్ ఎంసీ జోసెఫిన్ ఈ ఘటనను సుమోటో కేసుగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. శనివారం(డిసెంబర్ 19) ఆ నటి నుంచి ఆధారాలు సేకరించనున్నట్లు చెప్పారు.కేరళ పోలీసులు కూడా ఈ ఘటనపై సుమోటో కేసు నమోదు చేశారు. నెటిజన్లు కూడా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.