జర్మనీ యూనివర్శిటీలో కేరళ విద్యార్థిని: అనుమానస్పద స్థితిలో..చివరి ఫోన్ కాల్.. !
తిరువనంతపురం: కేరళకు చెందిన ఓ విద్యార్థిని జర్మనీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఉదంతం ఇది. జర్మనీ రాజధాని ఫ్రాంక్ ఫర్ట్ లో గల ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువు అప్లైడ్ సైన్స్ చదువుతున్న ఆ విద్యార్థిని ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. విశ్వవిద్యాలయం ఆవరణలో ఉండే విద్యార్థుల వసతి గృహంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి పేరు అనిలా అచన్ కుంజు.
కోర్టుకెళ్తే..నిలువునా తగులబెడతాం: గ్యాంగ్ రేప్ బాధితురాలి ఇంటికి కరపత్రం..!
కేరళలోని అళప్పుజ జిల్లా మావెలిక్కర సమీపంలోని పున్నమూడుకు చెందిన విద్యార్థిని. కొచ్చిన యూనివర్శిటీ పూర్వ విద్యార్థిని ఆమె. ఉన్నత చదువులను అభ్యసించడానికి మూడేళ్ల కిందట ఆమె జర్మనీకి వెళ్లారు. ఫ్రాంక్ ఫర్ట్ యూనివర్శిటీలో సీటు సంపాదించారు. అప్లైడ్ సైన్స్ కోర్సులో చేరారు. ఈ నెల 7వ తేదీన ఆమె పున్నమూడులో నివసించే తన తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. అదే ఆమె చివరి ఫోన్ కాల్. ఆ తరువాత తన కుమార్తె నుంచి ఎలాంటి సమాచారం రాలేదని మృతురాలి తండ్రి అచన్ కుంజు తెలిపారు.
ఈ నెల 8వ తేదీన రాత్రి వరకూ తాము పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ, తమ కుమార్తె నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. మూడు రోజుల తరువాత అనిలా తోటి విద్యార్థిని ఒకరు అచన్ కుంజుకు ఫోన్ చేశారు. అనిలా మరణించిన సమాచారాన్ని ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అనిలా కుటుంబ సభ్యులు ఫ్రాంక్ ఫర్ట్ కు బయలుదేరి వెళ్లారు. తమ కుమార్తెది ఆత్మహత్య చేసుకునేంతటి బలహీన మనస్తత్వం కాదని, దీని వెనుక గల కారణాలను వెలికి తీయాలని వారు కోరుతున్నారు.
ఈ మేరకు జర్మనీలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. 2016లో అనిలా తల్లి మోనీ మరణించారు. అదే ఏడాది ఆమె జర్మనీకి వెళ్లారు. తల్లి ద్వితీయ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి అనిలా 2018లో చివరిసారిగా కేరళకు చేరుకున్నారు. అప్పటి నుంచి ఆమె మళ్లీ స్వరాష్ట్రానికి వెళ్లలేదు. చివరి సంవత్సరం కావడం వల్ల పరీక్షలను ముగించుకుని ఒకేసారి వస్తానని తనకు సమాచారం ఇచ్చిందని, అంతలోనే ఇలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందనుకోలేదని అచన్ కుంజు ఆవేదన వ్యక్తం చేశారు.