ఆన్లైన్లో ఈ ఎంపీ ఫోను ఆర్డరిచ్చారు... పార్శిల్ తెరిచి చూస్తే మైండ్ బ్లాక్ అయ్యింది
మాల్డా: ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొక ఐటెం రావడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి. కొన్ని సార్లు అయితే ఆర్డర్ ఇచ్చిన ఐటెం లేకుండా బాక్సులు ఖాళీగానే వస్తున్న వార్తలను చదివాం. ఇక ఆర్డిరిస్తే ఐటెంకు బదులు ఏకంగా రాళ్లు కూడా రావడం చూశాం. తాజాగా ఇలాంటి పరిస్థితే ఒకరు ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకు సామాన్య ప్రజలకే తాము ఆర్డర్ ఇచ్చిన వస్తువు కాకుండా రాళ్లు రావడం జరిగాయి.. కానీ పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ ఎంపీకి మాత్రం ఆన్లైన్లో రాళ్లే వచ్చాయి.
పశ్చిమ బెంగాల్లోని మాల్డా ఎంపీ ఖగేన్ ముర్ము ఆన్ లైన్లో ఓ మంచి ఫోన్ ఆర్డర్ ఇచ్చారు. పార్శిల్ అయితే వచ్చిందిగానీ.. అది తెరిచి చూడగా ఎంపీనే షాక్ అయ్యారు. ఫోనుకు బదులుగా బాక్సులో రెండు రాళ్లు వచ్చాయి. తాను శాంసంగ్ ఫోన్ ఆర్డర్ ఇచ్చారని చెప్పిన ఎంపీ తీరా పార్శిల్ తెరిచి చూడగానే రెడ్మీ ఫోన్కు సంబంధించిన బాక్సు ఉండటాన్ని చూసి ఆశ్చర్యానికి గురైనట్లు చెప్పారు. తీరా బాక్సు తెరిచి చూడగానే ఇంకేముందు అందులో రెడ్మీ ఫోన్ కూడా లేదని రెండు రాళ్లు ఉండటంతో షాక్ అయినట్లు ఖగేన్ ముర్ము చెప్పారు. తాను ఆర్డర్ ఒక వారం క్రితం ఇవ్వగా దీపావళి రోజు పార్శిల్ వచ్చిందని చెప్పారు.
ఇక పార్శిల్ వచ్చిన సమయంలో తాను ఇంట్లో లేకపోవడంతో ఆ పార్శిల్ను తన భార్య తీసుకుని వెంటనే రూ.11,999 చెల్లించిందని చెప్పారు.అయితే ఆ పార్శిల్ను సోమవారం రోజున తెరువగా బాక్సులో రెండు రాళ్లు ఉండటం చూసి షాక్కు గురైనట్లు ఎంపీ చెప్పారు. వెంటనే మాల్డా పోలీసులకు తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. జరిగిన ఘటనపై విచారణ చేసి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాల్డా పోలీస్ చీఫ్ అలోక్ రాజోరియా చెప్పారు. తాను సాధారణంగా ఆన్లైన్లో ఆర్డర్లు చేయనని తన కొడుకు చేస్తూ ఉంటాడని చెప్పిన ఎంపీ తొలిసారిగా తాను ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే రాళ్లు రావడాన్ని తాను జీర్ణించుకోలేకున్నట్లు చెప్పారు. విషయాన్ని కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ వద్దకు తీసుకెళతానని చెప్పారు.