మాజీ ప్రధాని, ఖార్గే, ఆజాద్ ఎంట్రీ, సీఎల్ పీ భేటీ, సీఎం అవిశ్వాస తీర్మానం, క్రాస్ ఓటింగ్ భయం!
ముంబై/బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలను బెంగళూరు తీసుకురావడానికి కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ముంబైలో మకాం వేసిన రెబల్ ఎమ్మెల్యేలను ఎలా సంప్రధించాలని మాజీ ప్రధాని, ఖార్గే, ఆజాద్ ఆలోచిస్తున్నారు.
మాజీ ప్రధాని, ఖార్గే, ఆజాద్
మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు మల్లికార్జున్ ఖార్గే, గులాం నబి ఆజాద్ రెబల్ ఎమ్మెల్యేలకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం వారి ప్రలోభాలకు లొంగడం లేదని సమాచారం.
సారీ అంటున్న ఎమ్మెల్యేలు
ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలకు నచ్చచెప్పడానికి మంత్రి డీకే. శివకుమార్, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ తదితరులు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఇంకా కొంత మంది నాయకులు ముంబై చేరుకుని తమతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారని సమాచారం అందుకున్న రెబల్ ఎమ్మెల్యేలు మరింత భద్రత కల్పించాలని ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు.
సీఎంకు మద్దతుగా ఓటు
మరో వైపు బెంగళూరులో సోమవారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశం (సీఎల్ పీ) జరిగింది. ఈ సమావేశంలో సీఎం కుమారస్వామి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మద్దతుగా ఓటు వెయ్యాలని మాజీ సీఎం సిద్దరామయ్య సూచించారని సమాచారం.
క్రాస్ ఓటింగ్ భయం ?
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ క్రాస్ ఓటింగ్ కు పాల్పడరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మాజీ సీఎం సిద్దరామయ్య హెచ్చరించారని తెలిసింది. సోమవారం శాసన సభలో సీఎం కుమారస్వామి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి స్పీకర్ రమేష్ కుమార్ అనుమతి ఇస్తారా ? లేదా ? అనే విషయం ఆసక్తికరంగా మారింది.