సంకీర్ణ ప్రభుత్వానికి ఖార్గే సీఎం కావలసింది, మిస్ అయ్యింది, ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు !
బెంగళూరు: లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జన్ ఖార్గే ఎప్పుడో ముఖ్యమంత్రి కావలసిందని, కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి ఆయనే ముఖ్యమంత్రి కావల్సిఉండేదని, అయితే హైకమాండ్ ఇచ్చిన మాట కోసం అది సాధ్యంకాలేకపోయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు.
కలబురిగి జిల్లా చించోళి శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో సీఎం కుమారస్వామి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్బంగా సీఎం కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. చించోళి శాసన సభ నియోజక వర్గం అభివృద్ది కోసం అవసరం అయిన అన్ని పనులు సంకీర్ణ ప్రభుత్వం చేస్తుందని సీఎం కుమారస్వామి హామీ ఇచ్చారు.
మల్లికార్జన్ ఖార్గే ఆశీస్సులతో రాజకీయంగా ఎదిగిన వారు నేడు ఆయనకు విరుద్దంగా మాట్లాడుతున్నారని, ఆయన మీద తొడకోట్టి మాట్లాడుతున్నారని సీఎం కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్- కర్ణాటక అభివృద్ది కోసం మల్లికార్జున్ ఖార్గే శక్తి వంచనలేకుండా పని చేశారని, ఈ రోజు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని సీఎం కుమారస్వామి అసహనం వ్యక్తం చేశారు.
గత 11 నెలల నుంచి ఈ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ నాయకులు డబ్బా కొట్టుకుంటున్నారని, అది మాత్రం జరగేలేదని సీఎం కుమారస్వామి వ్యంగంగా అన్నారు. మీడియాలో వస్తున్న వార్తలను కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తలు పట్టించుకోరాదని సీఎం కుమారస్వామి మనవి చేశారు.
మే 19వ తేదీ చించోళి శాసన సభ నియోజవర్గం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ పార్టీల అభ్యర్థిగా సుభాష్ రాథోడ్, బీజేపీ నుంచి అవినాష్ జాదవ్ పోటీ చేస్తున్నారు. డాక్టర్ ఉమేష్ జాదెవ్ రాజీనామాతో చించోళి శాసన సభకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. డాక్టర్ ఉమేష్ జాదవ్, మల్లికార్జున్ ఖార్గేలు ఈ ఉప ఎన్నికలను సవాలుగా తీసుకుంటున్నారు. ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో గెలవాలని ఇరు వర్గాలు శక్తి వంచనలేకుండా పని చేస్తున్నాయి.