మోడీ! అలా జరగకపోతే దేశ రాజధానిలో బహిరంగంగా ఉరి వేసుకుంటావా?
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ముగింపు దశకు వస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు, నాయకుల మధ్య మాటల తూటాల్లా పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించేస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకో అడుగు ముందుకేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విసిరిన సవాల్ను తాము స్వీకరిస్తున్నామని ప్రకటించింది. లోక్సభ ఎన్నికల్లో తమకు 40 సీట్ల కంటే ఎక్కువ వస్తే.. మోడీ దేశ రాజధానిలో ఉరి వేసుకుంటారా? అని సవాల్ విసిరింది.
వచ్చేది హంగ్.. మేమే కింగ్: పవన్ కల్యాణ్!
మోడీ ఏమన్నారంటే..?
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. నరేంద్రమోడీ కాంగ్రెస్పై నిప్పులు చెరగడం సహజమే. బిహార్లోని ముజప్ఫర్పూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 స్థానాలు కూడా దక్కబోవని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఖేల్ ఖతమైపోయిందని, వందేళ్లకు పైగా వయస్సున్న కాంగ్రెస్కు ఇవే చివరి ఎన్నికలంటూ ధ్వజమెత్తారు. ఆర్థిక రంగం, ఉగ్రవాద నియంత్రణ వంటి అంశాల్లో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరిని అనుసరిస్తోందని, ఫలితంగా- ఉగ్రవాదులు దేశంలో తిష్ట వేశారని, వారిని తాము ఏరి పారేస్తున్నామని అన్నారు. రోడ్లపై గూండాగిరి చేసే నాయకులకు ఉగ్రవాదులను మట్టుబెట్టడం ఏం తెలుసని ఎద్దేవా చేశారు. సమాజ్వాది పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీలపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని సాధించేదేమీ లేదని అన్నారు. బజారు రౌడీలను కూడా నియంత్రించలేని ఆయా పార్టీల నాయకులకు ఉగ్రవాదులపై పోరాడటం చేత కాదని తేల్చారు. పైగా- కాంగ్రెస్ పార్టీ విధానాలన్నీ ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని పెంచి పోషించేలా ఉన్నాయని స్పష్టం చేశారు. అందుకే- కాంగ్రెస్ పార్టీకి ఈ సారి కనీసం 40 స్థానాలు కూడా దక్కబోవని ధీమా వ్యక్తం చేశారు. ఆ పార్టీకి ఓట్లు వేస్తే, అవి మురిగిపోయినట్టేనని అన్నారు.
కాంగ్రెస్ ఎలా తిప్పికొట్టిందంటే..?
నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పార్టీ సంస్థాగతాన్ని, మూలాలను ప్రశ్నిస్తూ మోడీ చెలరేగిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. 40 కంటే తక్కువ సీట్లే కాంగ్రెస్క వస్తాయనే అంశాన్ని తాము సవాల్గా తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. తమకు 40 కంటే ఎక్కువ స్థానాలు వస్తే.. మోడీ ఏం చేస్తారని ప్రశ్నించారు. దేశ రాజధానిలోని విజయ్ చౌక్ వద్ద మోడీ తనను తాను ఉరి వేసుకోవడానికి సిద్ధ పడతారా? అని ప్రతి సవాల్ విసిరారు ఖర్గే. కనీస మర్యాద తెలియని వ్యక్తిగా మోడీని అభివర్ణించారు. మరణించిన రాజీవ్గాంధీని అడ్డుగా పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.