విజయ్ మాల్యా కేసు: లండన్ కోర్టుకు ఆర్థర్ రోడ్ జైలు వీడియోను చూపించనున్న సీబీఐ..ఎందుకో తెలుసా?
దేశంలో బ్యాంకులకు కొన్ని వేల కోట్లు రుణాలు ఎగవేసి లండన్లో తలదాచుకుంటున్న లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా లాయర్ ఈ రోజు కొత్త విషయాలు వెల్లడించారు. మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ నష్టాల బాట పట్టినట్లు ఐడీబీఐ బ్యాంకుకు ముందే తెలుసునని వెస్ట్మిన్స్టర్ కోర్టుకు ఆయన చెప్పారు. ఈ విషయం ఐడీబీఐ మెయిల్స్ను చెక్ చేస్తే తెలుస్తుందన్నారు. మాల్యా నష్టాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్న ప్రభుత్వం మాటల్లో వాస్తవం లేదన్నారు.
విజయ్ మాల్యాకు ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట
చెడుద్దేశంతో బ్యాంకు నుంచి రుణాలు పొందలేదని... మంచి వ్యాపారం చేద్దామనే తన క్లయింట్ మాల్యా బ్యాంకుల నుంచి రుణం పొందాడని లాయర్ వివరించాడు. తన క్లయింట్ మాల్యా పై కేసు నమోదు చేయాల్సిందిగా బ్యాంకు అధికారులను సీబీఐ అధికారి రాకేష్ అస్తానా బెదిరించారని లాయర్ చెప్పారు. మరోవైపు కేసు వాదనల కోసం కోర్టుకు హాజరైన మాల్యా... భారత ప్రభుత్వంతో సెటిల్మెంట్ చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. తను డబ్బులు తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాల్యా స్పష్టం చేశాడు. కేసును ఈనెల 18కి వాయిదా వేశారు.
ఒకవేళ భారత్కు తిరిగి వస్తే మాల్యాను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించే అవకాశం ఉంది. అయితే ఆ జైలులో సరైన సదుపాయాలు లేవని అంతకుముందు మాల్యా వ్యాఖ్యానించారు. అందులో సరైన సహజ వెలుతురు వెంటిలేషన్ లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆర్థర్ రోడ్ జైలుకు సంబంధించి సీబీఐ ఒక ఎనిమిది నిమిషాలు నిడివి ఉన్న వీడియోను కోర్టుకు సమర్పించింది. ఇందులో ఉన్న సదుపాయాలు ఎలాంటివో కోర్టుకు వీడియో ద్వారా వెల్లడించనుంది. ఇందులో సహజ వెలుతురు వస్తుందని... సెల్లో వెస్ట్రన్ కమోడ్స్ ఉన్నాయని, బెడ్లు కూడా ఏర్పాటు చేసినట్లు వీడియోలో ఉన్నాయి. అంతేకాదు కొన్ని సెల్స్లో టీవీలు కూడా ఉన్నట్లు వీడియో ద్వారా కోర్టుకు చూపించనుంది .