మాల్యాకు ఎదురుదెబ్బ: ఆఫర్ను తిరస్కరించిన బ్యాంకులు
న్యూఢిల్లీ: బ్యాంకులకు రూ. 4వేల కోట్లు చెల్లిస్తానంటూ ముందుకొచ్చిన విజయ్ మాల్యాకు ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ ఎగవేత కేసుపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రూ. 4 వేల కోట్లు చెల్లిస్తానన్న విజయ్ మాల్యా ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు కోర్టుకు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం వెల్లడించింది.
తమకు బకాయిపడ్డ రూ. 9 వేల కోట్లను తిరిగి చెల్లించాల్సిందేనని, రూ. 4 వేల కోట్ల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని బ్యాంకుల కన్సార్టియం తరఫు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. బ్యాంకుల ప్రతిపాదనపై కింగ్ఫిషర్ యాజమాన్యం రెండు వారాల గడవుకోరింది.
కేసు తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించిన కేసులో మాల్యా మార్చి 2న భారత్ వదిలి లండన్ వెళ్లిపోయారు. దీంతో మార్చి 18న మాల్యా కోర్టులో హాజరుకావాలని ఈడీ మాల్యాకు సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే.
మార్చి నెలలో భారత్ రాలేనని ఏప్రిల్లో హాజరవుతానని మాల్యా న్యాయస్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏప్రిల్ నెలలో కూడా రారని మే నెలలో భారత్కు వస్తారని మాల్యా తరుపున ఆయన న్యాయవాది సుప్రీం కోర్టులో వాదన వినిపించారు.
కింగ్ ఫిషర్, యునైటెడ్ బ్రూవరీస్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని తిరిగి చెల్లించకుండా లండన్ పారిపోయిన విజయ్ మాల్యా ఆ తర్వాత తనకు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్టియంతో రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు.
వివిధ బ్యాంకులకు రూ. 9 వేల కోట్ల వరకు బకాయి పడటంతో అతడిని దేశం వదిలి వెళ్లనివ్వకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం సుప్రీంను ఆశ్రయించినా, అప్పటికే ఆయన లండన్ వెళ్లిపోయాడు. తనపై అంతర్జాతీయ మీడియా సైతం దుమ్మెత్తిపోయడంతో బ్యాంకులకు మాల్యా రూ. 4 వేల కోట్లు చెల్లిస్తానని ముందుకొచ్చాడు.