మమతా బెనర్జీ వరాలు: 9.5 లక్షల మంది విద్యార్థులకు ఫ్రీ ట్యాబ్లు, ఉద్యోగులకు 3శాతం డీఏ పెంపు
కోల్కతా: వచ్చే సంవత్సరంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పట్నుంచే వరాలను ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, మదర్సాలలో చదువుతున్న 9.5 లక్షల మంది విద్యార్థులకు ఆన్లైన్ చదువుల కోసం ఉచిత ట్యాబ్లను అందజేయనున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్ విద్యనందించేందుకు విద్యార్థులకు ట్యాబ్స్, సెకండరీ స్కూల్ విద్యార్థులకు కంప్యూటర్లను ఉచితంగా అందజేస్తామని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఆన్లైన్ క్లాసులు వినేందుకు విద్యార్థుల వద్ద స్మార్ట్ఫోన్ లాంటి సరైన సాధనం లేదని అందుకే తాము ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
బెంగాల్ రాష్ట్రంలో 36వేల ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్, 14వేల సెకండరీ స్కూల్స్, 636 మదర్సాలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మమతా బెనర్జీ వరాలు ఇచ్చారు. రాష్ట్రంలోని 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏను పెంచుతున్నట్లు ప్రకటించారు.
జనవరి 1, 2021 నుంచి ఈ మొత్తాన్ని అందజేయనున్నట్లు సీఎం మమత తెలిపారు. కాగా, డీఏ పెంపు కారణంగా రాష్ట్ర ఖజానాపై రూ. 2200 కోట్ల భారం పడనుంది. రాష్ట్రంలో ఐటీ సంస్థలు 133శాతం వృద్ధిని సాధించాయని తెలిపారు. ఐటీ నిపుణుల సంఖ్య 175 శాతానికి పెరిగిందని వెల్లడించారు.
2021, మే నెలలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ వరాలు ప్రకటించడం గమనార్హం. రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుంటుండటంతో మమతా ఆ పార్టీని గట్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికలు ముఖ్యంగా అధికార టీఎంసీ, బీజేపీల మధ్యే జరగనుంది.