మోడీకి దీదీ బాసట: వెన్నంటే ఉంటాం, శత్రుదేశంపై పోరాడేందుకు రె‘ఢీ’,చైనా వస్తువులు బ్యాన్..?
చైనాతో జరుగుతోన్న ఘర్షణపై చర్చించేందుకు ప్రధాని మోడీ నిర్వహిస్తోన్న అఖిలపక్ష సమావేశంలో అన్నీ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచాయి. డ్రాగన్పై పోరాడేందుకు కలిసికట్టుగా ఉంటామని పేర్కొన్నాయి. శత్రుదేశ దమననీతిని ఎండగట్టేందుకు రాజకీయ ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోన్నారు. పొరుగుదేశాన్ని దౌత్యపరంగా లేదంటే సైనిక చర్యతో ఎదుర్కొనే అంశంపై చర్చ కొనసాగుతోంది. ఈ నెల 15వ తేదీన తూర్పు లడాఖ్ గాల్వాన్ వ్యాలీలో చైనా జవాన్లు కల్నల్ సహా 20 మంది జవాన్లను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.
సమావేశంలో భాగంగా తొలుత కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ ప్రసంగించారు. తర్వాత టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడారు. అంతర్జాతీయ సరిహద్దు వద్ద చైనా ప్రవర్తించిన తీరు సరికాదు అని మమతా బెనర్జీ అన్నారు. నియంతృత్వ వైఖరితో ముందడుగు వేయడం సరికాదు అని అభిప్రాయపడ్డారు. ఏం చేయాలనుకున్నారో వారు అదే చేస్తున్నారు. ఈ సమయంలో మనమంతా ఒక్కటిగా ఉండాలి. ఒక్కటై పోరాడితే భారత్దే విజయం అని.. చైనా ఓడిపోవడం ఖాయమని చెప్పారు. మనమంతా ఓకే మాట, ఓకే ఆలోచనలతో, ఐకమత్యంగా ఉండాలని.. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపాలని కోరారు.
చైనా దుశ్చర్య తర్వాత ప్రధాని మోడీ అఖిలపక్ష సమావేశం నిర్వహించడం దేశానికి మంచి సందేశం ఇస్తోందని దీదీ అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో దేశం కోసం ఉన్న జవాన్ల వెనక.. మనమంతా ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని తెలిపారు. అంతేకాదు చైనా పరికరాలు టెలికాం, రైల్వే, విమానయాన రంగాల్లో వాడొద్దని స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితుల్లో చైనా వస్తువులను వాడొద్దు అని తేల్చిచెప్పారు.