ఢిల్లీలో పథకం ప్రకారమే జెనోసైడ్.. అల్లర్లుగా చిత్రీకరణ : మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీలో చెలరేగిన మత కల్లోలాలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పథకం ప్రకారం చేసిన జెనోసైడ్గా అభివర్ణించారు. ఈ మారణహోమానికి బీజేపీ ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదన్నారు. పైగా సిగ్గు లేకుండా ఇక్కడికి(కోల్కతా)కి వచ్చి బెంగాల్కి కూడా దాన్ని అంటించాలనుకుంటున్నారని ఆరోపించారు. 'కాబట్టి ఈరోజే మనందరం ప్రతిజ్ఞ చేద్దాం.. ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని కూల్చకపోతే ఇలాంటి అల్లర్లను మనం ఆపలేము' అని బెంగాల్ ప్రజలకు పిలుపునిచ్చారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం(మార్చి 1) కోల్కతాలో ఢిల్లీ అల్లర్లను మమతా బెనర్జీకి ముడిపెట్టిన మాట్లాడిన నేపథ్యంలో ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు. ఏప్రిల్-మే మధ్యలో బెంగాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. 2021లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు వీటిని రెఫరెండంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎంసీ,బీజేపీ మధ్య అప్పుడే మాటల యుద్దం మొదలైపోయింది.
పథకం ప్రకారమే చేశారన్న మమతా
ఢిల్లీలో జరిగింది పథకం ప్రకారం చేసిన మారణహోమం అని తాను చాలామందితో చెప్పానన్నారు మమతా బెనర్జీ. మారణహోమం సృష్టించి చివరకు అల్లర్లుగా చిత్రీకరించారని ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు కేంద్రం పరిధిలోనే పనిచేస్తారు కదా.. పోలీసులు,సీఆర్పీఎఫ్,సీఐఎస్ఎఫ్.. ఇంతమంది ఉన్నా అల్లర్లను ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. ఇంత జరిగినా బీజేపీ ఏమాత్రం సిగ్గులేకుండా కనీసం క్షమాపణ అడగడం లేదన్నారు.
గోలీ మారో వ్యాఖ్యలపై స్పందన..
అమిత్ షా ర్యాలీలో కొంతమంది బీజేపీ కార్యకర్తలు 'గోలీ మారో..(కాల్చి పారేయండి)' అంటూ వ్యాఖ్యలు చేయడంపై కూడా మమతా స్పందించారు. ఇది ఢిల్లీ కాదు.. కోల్కతా అని హెచ్చరించారు. ఇలాంటివాటి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే.. ఇతరులు దీన్ని అవకాశంగా తీసుకుంటారని అన్నారు. అలాంటి నినాదాలు చట్ట విరుద్దమని.. ఆ వ్యాఖ్యలు చేసినవారు చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటారని అన్నారు. ఢిల్లీలో అలాంటి వివాదాస్పద నినాదాలు చేసిన బీజేపీ నేతలను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. తమ రెచ్చగొట్టుడు నినాదాలో అంతమంది చావులకు కారణమైవారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని నిలదీశారు.
అమాయక ప్రజలను బలితీసుకోవడంపై వివరణ ఇవ్వాలన్న మమతా..
ఇక్కడకొచ్చి రెచ్చగొట్టడం కాకుండా.. ఢిల్లీ అల్లర్లలో 50 మంది అమాయకులు మృతి చెందడంపై అమిత్ షా వివరణ ఇవ్వాలని, అందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశ ద్రోహులెవరో ప్రజలే నిర్ణయిస్తారని.. అది నిర్ణయించడానికి మీరెవరని మమతా ప్రశ్నించారు. గోలీ మారో నినాదాలు చేసినవాళ్లలో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారని.. మిగతావాళ్లను పట్టుకునేందుకు టీఎంసీ కార్యకర్తలు కూడా సహాయం చేయాలని అన్నారు. వాళ్లను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. అంతే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని చెప్పారు. ఢిల్లీ అల్లర్లలో మృతి చెందినవారికి ఆర్థిక సాయం చేసేందుకు విరాళాలు సేకరించాలని మమతా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అల్లర్లలో మృతి చెందినవారి కోసం కొద్ది నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన ఘోరంపై బీజేపీని వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
మమతా టార్గెట్గా అమిత్ షా వ్యాఖ్యలు..
ఆదివారం కోల్కతాలో బీజేపీ నిర్వహించిన సభలో పాల్గొన్న అమిత్ షా.. మమతా బెనర్జీ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ.. రాష్ట్రంలో రైళ్లు తగలబెడుతూ అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సీఏఏని మమతా అడ్డుకోలేదని స్పష్టం చేశారు. మమతా బెనర్జీని తాను ఒక్కటే అడగాలనుకుంటున్నానని.. శరణార్థుల ప్రయోజనాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మీరు అక్రమ చొరబాటుదారుల గురించి పట్టించుకుంటారు గానీ.. పొరుగుదేశాల్లో అణచివేతకు,హింసకు గురవుతున్న హిందువుల గురించి మీకు పట్టదా అని ప్రశ్నించారు. బెంగాల్లో తదుపరి ప్రభుత్వాన్ని మూడొంతుల్లో రెండొంతుల మెజారిటీతో తామే ఏర్పాటు చేయబోతున్నామని దీమా వ్యక్తం చేశారు.