అబద్దాలను వల్లెవేశారు, ఇదీ లెక్క.. అమిత్ షాపై దీదీ గుస్సా.. పవార్తో మంతనాలు
బెంగాల్లో అప్పుడే ఎన్నికలకు బీజేపీ, టీఎంసీ రెడీ అయ్యాయి. రాష్ట్రం వెనకబడి ఉంది అని హోం మంత్రి అమిత్ షా పేర్కొనగా.. సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. బెంగాల్ పర్యటనలో అమిత్ షా పచ్చి అబద్దాలు చెప్పారని విరుచుకుపడ్డారు. పరిశ్రమలు, అభివృద్ధిలో రాష్ట్రం వెనకబడిందని తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. మధ్య చిన్న తరహా పరిశ్రమల్లో బెంగాల్ నెంబర్ వన్ స్థానంలో ఉంది అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు నిర్మించడంలో ముందు వరసలో ఉంది అని.. ఇదీ కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయని తెలిపారు. మరీ ప్రభుత్వ లెక్కలను అమిత్ షా తప్పుగా ఎలా చూపిస్తారని ప్రశ్నించారు.
తప్పుడు ప్రచారం..
పారిశ్రామిక రంగంలో బెంగాల్ వెనకబడిందని తప్పుడు ప్రచారం అమిత్ షా చేశారని మమతా చెప్పారు. కానీ ఎంఎస్ఎంఈలో బెంగాల్ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లను నిర్మించలేదు అని అసత్య ప్రచారం చేశారని విరుచుకుపడ్డారు. కానీ అందులో కూడా ప్రథమ స్థానంలో ఉన్నామని చెప్పారు. దీనిని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని వివరించారు. కానీ బీజేపీ తమ స్వార్థ రాజకీయాల కోసం ఎంతకన్నా దిగజారుతోందని చెప్పారు. హోం మంత్రి స్థానంలో ఉండి.. అబద్దాలను ఎలా వల్లేవేస్తారని నిలదీశారు.
అబద్దాలను వల్లెవేశారు..
అమిత్ షా చెప్పిన అబద్దాలను టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత టీఎంసీ స్థాపించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారని.. బెంగాలీల ఉన్నతి కోసం పాటుపడ్డారని చెప్పారు. కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముక్కలుగా చేశారని అమిత్ షా ఆరోపించడం మాత్రం తగదని ఒబ్రెయిన్ అన్నారు. బెంగాల్లో 35 ఏళ్లు కమ్యునిస్టులు పాలించారనే విషయం అమిత్ షా మరచిపోయినట్టు ఉన్నారని తెలిపారు. టీఎంసీ 2011లో అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. కానీ 50.. 60 ఏళ్ల నాటి డేటాను చూపి.. నెపం టీఎంసీపై వేయాలని చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు.
35 ఏళ్లు కమ్యునిస్టులే పాలించారు కదా..
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వన్ థర్డ్ జీడీపీని బెంగాల్ కంట్రిబ్యూట్ చేసిందని తెలిపారు. పరిశ్రమల్లో 30 శాతం బెంగాల్ నుంచి ఉండేవని.. కానీ ఇదీ 3.5 శాతానికి పడిపోయిందని చెప్పారు. దీనికి 9 ఏళ్ల క్రితం అధికారం చేపట్టిన పార్టీ ఎలా కారణం అవుతుందని ఒబ్రెయిన్ ప్రశ్నించారు. 1960లో బెంగాల్ ధనిక రాష్ట్రం అని వివరించారు. 1950లో బెంగాల్ 70 శాతం ఫార్మా ఉత్పత్తి చేసేదని.. కానీ ఇదీ ప్రస్తుతం 7 శాతానికి పడిపోయిందని చెప్పారు. జూట్ పరిశ్రమల్లో చాలా మందికి ఉపాధి లభించిందని వివరించారు. కానీ తాము బెంగాల్ను సోనార్ బంగ్లా చేస్తామని ఒబ్రెయిన్ స్పష్టంచేశారు.
పవార్తో మమత మంతనాలు
మరోవైపు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో మమతా బెనర్జీ మాట్లాడారు. ఎన్డీఏ అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధింపు చర్యల గురించి మాట్లాడారు. ఈ విషయాన్ని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తెలిపారు. అధికారం ఉపయోగించి ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు.
బెంగాల్లో ఎన్నికలకు ముందు కక్షసాధింపు చర్యలు ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. ఇటీవల జేపీ నడ్డా కాన్వాయ్పై జరిగిన దాడితో వివాదం చెలరేగింది. ఘటనకు బాధ్యులుగా భావిస్తూ.. ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యూటేషన్పై పంపాలని కేంద్రం కోరిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల హక్కుల ఉల్లంఘన గురించి ఇద్దరు నేతలు చర్చించుకున్నారని. కేంద్ర ప్రభుత్వానికి చెందిన దర్యాప్తు సంస్థలతో అధికార దుర్వినియోగం సరికాదని నబావ్ మాలిక్ తెలిపారు.