ఫైర్బ్రాండ్ను చిర్రెత్తించిన జైశ్రీరామ్ నినాదాలు: కారు దిగి మరీ వార్నింగ్
కోల్కత: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి దేశ రాజకీయాల్లో ఫైర్బ్రాండ్ అనే పేరుంది. ముతక చీరను ధరించి, కాళ్లకు సాధారణ హవాయ్ చెప్పులు వేసుకుని తిరుగుతూ, చూట్టానికి సాదాసీదాగా కనిపించే మమతా బెనర్జీకి భారతీయ జనతాపార్టీ అంటే ఒళ్లు మంట. కమలనాథుల పేరు వింటే ఒంటికాలిపై లేస్తుంటారామె. శనివారం పశ్చిమ బెంగాల్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి మమతా బెనర్జీ కారులో వెళ్తుండగా.. రోడ్డు పక్కన నిల్చున్న కొందరు యువకులు జైశ్రీరామ్ అంటూ పెద్దఎత్తున నినాదాలు ఇచ్చారు. ఈ నినాదాలు ఆమెను చిరాకు పుట్టించినట్టున్నాయి.
కోల్కత కాళికలా మారిపోయారు. వెంటనే- కారును నిలిపివేసి, కిందికి దిగారు. ఎవడ్రా అది అంటూ తీవ్ర స్వరంతో పిలిచారు. ఆ రూపంలో ఆమెను చూసిన సదరు యువకులు.. కాలికి బుద్ధి చెప్పారు. అక్కడి నుంచి పరుగు లంకించుకున్నారు. పరుగెత్తుతున్న వారిని చూసి, ఎక్కడికి పారిపోతారు మీరు? అని మరోసారి హూంకరించారు. పశ్చిమ మిడ్నాపూర్లోని చంద్రకోన ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన 23 సెకెన్ల నిడివి ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. మమత కారులో వెళ్తుంటే- కొందరు యువకులు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం, అది విని ఆమె కారులో నుంచి కిందికి దిగి, వారిని బెంగాలీ భాషలో హెచ్చరించడం ఇందులో స్పష్టంగా రికార్డయ్యింది.
జైశ్రీరామ్ అనే నినాదాలు మమతా బెనర్జీకి చిరాకు పుట్టించాయనుకుని ఆమె నిఖార్సయిన నాస్తికురాలిగా భావించడానికి వీల్లేదు. నిజానికి మమతా బెనర్జీకి దైవభక్తి ఉంది. తరచూ కోల్కతలోని కాళీఘాట్లో ఉన్న ప్రఖ్యాత కాళికా దేవి అమ్మవారి ఆలయానికి వెళ్తుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. పెయింటింగ్లను వేసే హాబీ ఉన్న మమతా బెనర్జీ అప్పుడప్పుడూ తన కుంచెకు పని చెబుతుంటారు. అందులోనూ- కాళికా అమ్మవారి చిత్రాలను ఎక్కువగా వేస్తుంటారామె. కాకపోతే- జైశ్రీరామ్ అనే నినాదాన్ని బీజేపీ నాయకుల పేటెంట్గా భావిస్తున్నందున.. మమతా బెనర్జీ ఆ నినాదాలపై ఇలా ప్రతికూలంగా స్పందించాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.