అసంబద్దం.. రెండుసార్లు లేఖ రాస్తే పట్టించుకోలేదు.. మోదీ చెప్పేవన్నీ అసత్యాలు.. దీదీ ఫైర్
అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్లో టీఎంసీ-బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యం నువ్వా నేనా అన్నట్లుగా ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు,ఆరోపణలు చేయగా... దీదీ కూడా ప్రధానికి కౌంటర్ ఇచ్చారు. అర్ధ సత్యాలతో,వక్రీకరణలతో బెంగాల్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దీదీ ఫైర్ అయ్యారు.
మోదీ ఆరోపణలు అసంబద్దం...: మమతా
'రాష్ట్రంలో మేము ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలుచేస్తున్నాం. అలాంటిది ఒక్క పీఎం కిసాన్ యోజన పథకం విషయంలో మాత్రం కేంద్రానికి సహకరించట్లేదని ఆరోపణలు చేయడం అసంబద్దం. బీజేపీ నేత్రుత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆఖరికి పథకాల అమలు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలను ఇరుకునపెట్టేలా రాజకీయాలు చేస్తోంది. రాజకీయ లబ్ది కోసమే ఈ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. రైతు ప్రయోజనాల విషయంలో కేంద్రానికి సహకరించేందుకు మేమెప్పుడూ సిద్దంగానే ఉంటాం.' అని మమతా పేర్కొన్నారు.
రెండుసార్లు లేఖ రాసినా...
'పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి స్వయంగా నేనే కేంద్రానికి రెండుసార్లు లేఖ రాశాను. రెండు రోజుల క్రితం సంబంధిత అధికారులతోనూ మాట్లాడాను. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు వారు నిరాకరిస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన రూ.85వేల కోట్లు కేంద్రం మంజూరు చేయలేదు. ఇందులో రూ.8వేల కోట్లు జీఎస్టీ నిధులు కూడా ఉన్నాయి. ఒకవేళ బెంగాల్కు సాయం చేసే విషయంలో మోదీకి నిజంగా చిత్తశుద్ది ఉంటే ముందు పెండింగ్ నిధుల్లో కొంత భాగమైనా విడుదల చేయాలి.' అని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.
బెంగాల్ ప్రజలు గట్టి బుద్ది చెప్తారు...
పీఎం కిసాన్ నిధి పథకాన్ని బీజేపీ పూర్తిగా రాజకీయం చేస్తోందని మమతా ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది రైతులు ఇంకా రోడ్లపై ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. రైతు వ్యతిరేక విధానాలతో కనీస మద్దతు ధర కూడా లేకుండా రైతులను కార్పోరేట్ల దయా దాక్షిణ్యాలకు వదిలేసేందుకే కేంద్రం ఈ చట్టాలను తీసుకొచ్చిందని రైతు లోకం ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నవారికి రాబోయే ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు గట్టిగా బుద్ది చెప్తారని అన్నారు.
రైతులకు రూ.5వేలు ఇస్తున్న బెంగాల్ ప్రభుత్వం..
'కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెబుతోంది. అంటే,ఈ డబ్బులు మీకు నేరుగా మోదీ ఇస్తున్నాడని రైతులకు చెప్తారు. ఇది ఫెడరల్ స్పూర్తికి పూర్తిగా విరుద్దం. కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం 2019 ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు బెంగాల్లో కూడా దీని ద్వారా ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతుల కోసం చిత్తశుద్దితో పనిచేస్తోంది. ఒక్కొక్కరికి ఎకరాకు రూ.5వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది.' అని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ పేర్కొన్నారు.