మమత ఢిల్లీ టూర్ సక్సెస్-పవార్, సోనియాతో మంత్రాంగం- తరచుగా వస్తానన్న దీదీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఎన్సీపీ ఛీఫ్ శరద్ పవార్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ తోనూ ఆమె వరుసగా భేటీలు నిర్వహించారు. వీటిలో విపక్షాల ఐక్యతపై ఆమె చర్చలు జరిపారు. ఇవి విజయవంతం కావడంతో త్వరలో మరిన్ని పర్యటనలు ఉంటాయని దీదీ సంకేతాలు ఇచ్చారు.
ఇకపై రెండునెలలకోసారి ఢిల్లీలో పర్యటిస్తానని మమతా బెనర్జీ ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరింత మంది విపక్ష నేతల్ని కలిసి ఏకతాటిపైకి తెస్తానని వెల్లడించారు. తన తాజా ఢిల్లీ పర్యటన సంతోషాన్నిచ్చిందని, భవిష్యత్తులో మరిన్ని పర్యటనలు ఉంటాయని ఆమె సంకేతాలు ఇచ్చారు. 2024 ఎన్నికల వ్యూహంపై ప్రశ్నించగా.. అందరి లక్ష్యం దేశాన్ని కాపాడటమే అని దీదా వెల్లడించారు. దేశం అభివృద్ధి చెందాలని, మన ప్రజలకు అభివృద్ధి అవసరమని మమత తెలిపారు. పెట్రో ధరలతో పాటు అన్ని ధరలు పెరుగుతున్న కోవిడ్ మూడో దశ ముప్పుపై ఆమె కేంద్రానికి హెచ్చరికలు చేశారు.
తన ఐదు రోజుల ఢిల్లీ పర్యటనలో మమతా బెనర్జీ సోనియా, రాహుల్, పవార్, కేజ్రివాల్ తో పాటు మరికొందరు విపక్ష నేతల్ని కలుసుకుని సుదీర్ఘ చర్చలు జరిపారు. అదే సమయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతోనూ మమత భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోడీతో విభేదిస్తారని పేరున్న గడ్కరీని మమత కలవడం చర్చనీయాంశమైంది. సోనియాతో జరిగిన చర్చలపై స్పందించిన మమత... దేశంలో తాజా రాజకీయ పరిస్ధితులతో పాటు గాంధీలతో కూడిన విపక్ష కూటమి ఏర్పాటుపై చర్చించానన్నారు.