లాక్డౌన్కు రూ.10 లక్షల కోట్ల ప్యాకేజీకి లింకు పెట్టిన మమతా బెనర్జీ: ఎట్టకేలకు కీలక నిర్ణయం
కోల్కత: దేశవ్యాప్తంగా కోరలు చాస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ను నియంత్రించడానికి అన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను ప్రకటిస్తున్నాయి. ఒడిశా తరువాత.. ఒక్కో రాష్ట్రం లాక్డౌన్ను ప్రకటిస్తోంది. పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ తరువాత పశ్చిమ బెంగాల్ కూడా అదే నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ను ప్రకటించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.
ఏప్రిల్ 30 వరకూ పశ్చిమ బెంగాల్లో లాక్డౌన్ అమలులో ఉంటుందని సీఎం మమత బెనర్జీ స్పష్టం చేశారు. జూన్ 10 వరకు పాఠశాలలు, విద్యాసంస్థలు మూసివేస్తామని తెలిపారు. జూన్ 10 వరకు స్కూళ్లు తెరవొద్దంటూ ఆదేశాలను జారీ చేశారు. లాక్డౌన్ పొడిగించిన ప్రస్తుత పరిస్థితుల్లో తమ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఙప్తి చేస్తున్నారు.
లాక్డౌన్ వల్ల తమ రాష్ట్రంలో లక్షలాది మంది కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, దీనికోసం కేంద్రం ఆర్థిక సహాయాన్ని అందించాల్సి ఉంటుందని అన్నారు. 10 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని తాము కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని అన్నారు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు చెప్పారు.
చాలా ప్రాంతాలను రెడ్జోన్ కిందికి తీసుకొచ్చామని అన్నారు. రెడ్జోెన్ ప్రకటించడం వల్ల ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టామని చెప్పారు. లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. 10 లక్షల రూపాయల ప్యాకేజీని తమ రాష్ట్రానికి కేటాయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరుతున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని తాను అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లోనూ స్పష్టం చేసినట్లు చెప్పారు.
Recommended Video