రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు జడ్ కేటగిరి భద్రత: మమతా బెనర్జీ ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత ఏర్పాటు చేయనుంది. ప్రస్తుం ఆయన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు రాజకీయ ప్రత్యర్థుల నుంచి ప్రమాదం పొంచిఉందనే భావనతో మమతా బెనర్జీ ప్రభుత్వ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇద్దరు వ్యక్తిగత భద్రత సిబ్బంది, ఒక ఎస్కాట్, హౌస్ గార్డ్ సహా అవసరాన్ని బట్టి స్థానిక పోలీసుల భద్రతను కూడా ఏర్పాటు చేయనున్నారు. 2021లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లోనే ఎన్నడూలేని విధంగా బీజేపీ బాగా పుంజుకుంది. ఏకంగా 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీ పార్టీకి బీజేపీ సవాల్గా మారింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మమతా బెనర్జీ.. ప్రశాంత్ కిషోర్ను తమ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విజయంలోనూ ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ తోపాటు తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ కూడా ప్రశాంత్ కిషోర్ ను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నారు.