సుప్రీంకోర్టులో దీదీకి ఎదురుదెబ్బ.. మోడీ, అమిత్షా పై నిప్పులు
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతా నగర పోలీస్ కమిషనర్ సీబీఐ విచారణకు హాజరైతే తప్పేంటి అని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో ఆధారాలు మాయం చేశారంటూ సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. బెంగాల్ సిట్ సరిగా దర్యాప్తు చేయలేదని అడ్వకేట్ జనరల్ వాదించారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సీబీఐ విచారణకు సహకరించాల్సిందేనంటూ స్పష్టం చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణ ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలపై మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు, ఇది ప్రజా విజయం అంటూ వ్యాఖ్యానించారు. సీబీఐ దర్యాప్తును తాము ఎన్నడూ అడ్డుకోలేదన్న దీదీ.. సీబీఐ వైఖరిని మాత్రమే తప్పుపడుతున్నట్లు చెప్పారు. మోడీ ప్రభుత్వంపైనే మా యుద్ధం తప్ప.. రాజకీయం చేసే ఉద్దేశం తమకు లేదన్నారు. మోడీ, అమిత్ షా ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరంగా మారారని చెప్పుకొచ్చారు.