కర్ణాటక రిజల్ట్స్: జెడి(ఎస్)తో కాంగ్రెస్ పొత్తుకు ఆ ఫోన్లే కారణమా?
బెంగుళూరు:కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ట్రెండ్స్ ఆధారంగానే బిజెపి కంటే ముందుగానే త్వర పడాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీకి ఇతర ప్రాంతీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సలహలిచ్చారు.
ఈ మేరకు జెడి(ఎస్)కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు సోనియా సిద్దమైందని సమాచారం.దక్షిణాదిలో బిజెపికి పట్టం కట్టకుండా ఉండేందుకు గాను జెడి(ఎస్)కు అవకాశం కల్పించేందుకు కూడ కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. అంతేకాదు కాంగ్రెస్, జెడి(ఎస్) నేతలు రాజ్ భవన్లో మంగళవారం సాయంత్ర గవర్నర్ విజూభాయ్ వాలాను కలుసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.
అయితే గతంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ దఫా అత్యంత వేగంగా పావులు కదిపింది. బిజెపికి అధికారం దక్కకుండా చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నాలను చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కెసిఆర్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ, బిఎస్పీ అధినేత్రి మాయావతి కూడ ఉన్నారని ప్రచారం సాగుతోంది.
గోవా రాష్ట్రంలో బిజెపికి మెజారిటీ లేకున్నా అధికారాన్ని కైవసం చేసుకొన్న విషయాన్ని ఆయా రాష్ట్రాల సీఎంలు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం అలర్ట్ గా వ్యవహరించిందని సమాచారం.
కాంగ్రెస్ పార్టీ ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వెనుక ముగ్గురు ముఖ్యమంత్రుల ఫోన్కాల్స్ చలువ కూడా ఉందని తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ వెలువడుతున్న సమయంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ సోనియాగాంధీకి ఫోన్ చేసి ఆమెను అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కూడా సోనియాకు ఫోన్చేసి.. చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. గతంలో గోవా తరహాలో ఆలస్యం చేసి.. మరోసారి బీజేపీకి అవకాశం కల్పించవద్దని.. చురుగ్గా, వేగంగా పావులు కదిపి.. బీజేపీని నిలువరించాలని ఈ ముగ్గురు సీఎంలు సోనియాకు సూచించినట్టు తెలుస్తోంది.