ఎన్నికల వేళ మమతా బెనర్జీ ‘మా’: రూ. 5కే భోజనం, గుడ్డు కూర కూడా!
కోల్కతా: రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. తాజాగా, పేదలకు రూ. 5కే భోజనం అందించేలా 'మా' పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చారు.
ఈ పథకం ద్వారా ప్లేటు భోజనం రూ. 5కే అందుబాటులో ఉంచనున్నారు. ఈ మెనూలో అన్నం, పప్పు, కూరగాయలతోపాటు గుడ్డు కూర కూడా ఉండనుంది. ఈ భోజనానికి 15 రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. కాగా, రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలు ఈ కిచెన్లను నిర్వహించనున్నాయి.
ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ భోజనం సరఫరా చేయనున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు. అలాగే, ఈ కిచెన్లను క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
కాగా, వచ్చే ఏప్రిల్/మే నెలల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార టీఎంసీతోపాటు బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. టీఎంసీలోని పలువురు కీలక నేతలు ఇప్పటికే బీజేపీలో చేరిపోయారు.
టీఎంసీలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారితోపాటు సుమారు 9 మంది ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు ఆ పార్టీని వదిలేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, రాజ్యసభ ఎంపీ దినేశ్ త్రివేది కూడా టీఎంసీ గుడ్ బై చెప్పారు. కాగా, ఆయనకు బీజేపీ నేతలు పార్టీలోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. అంతేగాక, తాను బీజేపీలో చేరడంలో తప్పేముందని, ఆ పార్టీ తనకు స్వాగతం పలకడం ఎంతో గర్వంగా ఉందని దినేశ్ త్రివేది చెప్పడం గమనార్హం. త్వరలోనే ఆయన కూడా బీజేపీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.