ఇంట్రెస్టింగ్: ప్రధాని మోడీతో భేటీకి ముందు ఆయన సతీమణిని కలిసిన మమతాబెనర్జీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు బయలు దేరారు. అయితే కోల్కతా విమానాశ్రయంలో ఒక్కింత ఆసక్తికరమైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. మోడీ సతీమణి జశోదాబెన్ను సీఎం మమతా బెనర్జీ కలిశీ ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆ సమయంలో జశోదాబెన్కు ఓ చీరను సీఎం మమతా బెనర్జీ బహూకరించారు.
జశోదాబెన్ టీచర్గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఆమె పొరుగు రాష్ట్రం జార్ఖండ్లోని ధన్బాద్లో ఓ వ్యక్తిగత కార్యక్రమానికి హాజరై తిరిగి గుజరాత్కు వెళ్లేందుకు కోల్కతా విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో మమతా బెనర్జీ కూడా వచ్చారు. ఇద్దరి మధ్య సమావేశం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు జశోదాబెన్ అసన్సోల్లోని ప్రముఖ కల్యాణేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీని దీదీ బుధవారం కలవనున్నారు. మోడీ రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత వారిద్దరి మధ్య భేటీ జరగడం ఇది తొలిసారి. దీంతో అందరి దృష్టి ఈ సమావేశంపైనే ఉంది. రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని ప్రధాని మోడీని మమతా బెనర్జీ కోరే అవకాశం ఉంది. అంతకుముందే ప్రధాని మోడీకి, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షాతో పాటు పలువురు కేంద్రమంత్రులకు మిఠాయిలు పంపారు దీదీ. ఇక మంగళవారం ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. బెంగాలీలో తనకు శుభాకాంక్షలు తెలిపారు దీదీ. సాధారణంగా మోడీ అంటేనే ఫైర్ అయ్యే దీదీ... మోడీతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది.