మమతా బెనర్జీ పాలన లెఫ్ట్కి పునర్జన్మే: బెంగాల్ సర్కారుపై నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలతో వేడొక్కుతోంది. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మమతా బెనర్జీ నుంచి మమత(అప్యాయత) కరువైందంటూ చురకలంటించారు.
మమత నుంచి అప్యాయతను ప్రజలు కోరుకుంటే.. ఆమె నుంచి మాత్రం నిర్మమత(క్రూరత్వం) లభించిందంటూ విమర్శించారు. హల్దియాలో నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. తృణమూల్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు.
వామపక్ష ప్రభుత్వానికి తృణమూల్ ప్రభుత్వం పునర్మన్మనిచ్చిందని మోడీ విమర్శించారు. 'భారత్ మాతాకీ జై' అని నినదిస్తే నచ్చని మమతా బెనర్జీ.. దేశాన్ని అప్రతిష్ట పాల్చేసే కుట్రలపై మాత్రం నోరు మెదపరని చురకలంటించారు. తృణమూల్ హయాంలో నేరాలు వ్యవస్థీకృతమైపోయాయని తీవ్రంగా విమర్శించారు.అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అధికారం ఇవ్వాలని భావిస్తున్నారని తెలిపారు.
తాము అధికారంలోకి వస్తే కేంద్ర పథకాలన్నీ రాష్ట్రంలో అమలయ్యేలా తొలి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు ప్రధాని మోడీ. రాష్ట్రంలోని సుమారు 25 లక్షల మంది రైతులకు ఎంతో లబ్ధి చేకూర్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కూడా మమతా అడ్డుకున్నారని మండిపడ్డారు.
కేరళలో పరస్పరం పోటీ పడుతున్న కాంగ్రెస్, వామపక్షాలు బెంగాల్లో మాత్రం కలిసి పోటీ చేస్తున్నాయని మండిపడ్డారు. కేరళలో చెరో ఐదేళ్లపాటు పాలించాలనే ఒప్పందంతోనే అక్కడ లెఫ్ట్, కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నాయన్నారు.
మరోవైపు, 4700 కోట్ల విలువైన నాలుగు ప్రాజెక్టులను ప్రధాని మోడీ హల్దియాలో ప్రారంభించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో 200లకుపైగా స్థానాలు దక్కించుకుని అధికారం చేపట్టాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. అధికార టీఎంసీలోని సువేందు అధికారి సహా పలువురు కీలక నేతలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.