బిగ్ బజార్ కు బిగ్ బాస్ మోడీ: మమతా బెనర్జీ
పెద్ద నోట్లు రద్దు చెయ్యడంతో ప్రధాని నరేంద్ర మోడీ మీద పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పాట్నా: పెద్ద నోట్లు (రూ. 1,000, రూ.500) రద్దు చెయ్యడంతో ప్రధాని నరేంద్ర మోడీ మీద పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మన ప్రధాని నరేంద్ర మోడీ బిగ్ బజార్ కు బిగ్ బాస్ గా మారిపోయారని మండిపడ్డారు.
పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ బుధవారం బీహార్ రాజధాని పాట్నాలో మమతా బెనర్జి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె ప్రధాని నరేంద్ర మోడీ పని తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పిల్లలు సైతం 'పేటీఎం' అనకుండా 'పేపీఎం' అంటున్నారని ఎద్దేవ చేశారు. కష్టకాలంలో కుటుంబాన్ని ఆదుకోవడానికి మహిళలు పొదుపు చేసుకున్న డబ్బు ఇచ్చేవారని గుర్తు చేశారు.
కానీ ప్రధాని మోడీ మొత్తం డబ్బు అంతా తీసుకుంటున్నారని ఆరోపించారు. స్త్రీ ధనానికి, స్త్రీ శక్తికి ఇది అవమానం అని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి ఎమర్జెన్సీ కన్నా దారుణంగా ఉందని విరుచుకుపడ్డారు.
మోడీ తీసుకున్న నిర్ణయం ఆర్థిక ఎమర్జెన్సీలా ఉందని, ఇది చాలా దారుణం అని అన్నారు. కావాలంటే బిచ్చం ఎత్తుకుంటాం, రోడ్ల మీద పడుకుంటాం కాని మీ డబ్బును మాత్రం మేము ఆశించమని ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మమతా బెనర్జీ ర్యాలీలో విరుచుకుపడ్డారు.