మమతకు తప్పిన ప్రమాదం: హడలెత్తించిన ఉమాభారతి
కోల్కతా/లక్నో: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాల్దా జిల్లాలో పర్యటిస్తున్న మమత.. అక్కడ ఒక హోటల్ గదిలో బస చేశారు. కాగా, సాయంత్రం 6.30గంటల సమయంలో గదిలో ఉన్న ఏసీకి నిప్పంటుకుంది. అప్పుడు మమత స్నానాల గదిలో ఉన్నారు. దీంతో బయట పెద్ద శబ్ధం వినిపించడంతో మమత సహాయం కోసం గట్టిగా అరిచారు.
దీంతో సమీపంలో ఉన్న ఆమె సహాయకుడు జోయ్దీప్ మమతను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అప్పటికే హోటల్ గది పూర్తిగా పొగతో నిండిపోయింది. అగ్ని ప్రమాదంలో మమతకు ఎటువంటి గాయాలు కాలేదని అదే హోటల్ బస చేసిన రాష్ట్రమంత్రి మదన్ మిత్రా, పార్టీ ఎంపి మిథున్ చక్రవర్తి తెలిపారు. ప్రమాదం వెనక ఏదైనా కుట్ర ఉండవచ్చని అనుమానం వ్యక్తి చేసినా.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వచ్చాయని పోలీసులు వెల్లడించారు.
హడలెత్తించిన ఉమా భారతి హెలికాప్టర్
లక్నో: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చేరాలనుకున్న గమ్యానికి చేరకపోవడంతో ఒక్కసారిగా అధికారులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఝాన్సీ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమె రాజ్ఘాట్ నుంచి కళ్యాణపుర గ్రామానికి వెళ్లాల్సి ఉంది.
కాగా, సాంకేతిక కారణాల వల్ల ఉమాభారతి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సమీపంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలోని పిఛోర్లో దిగింది. అక్కడి నుంచి అదే హెలికాప్టర్లో ఉమాభారతి సురక్షితంగా లలిత్పూర్కు చేరుకోవడంతో అధికారులు, పార్టీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు. వాతావరణం నుకూలించకపోవడం వల్లనే ఈ విధంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు.