ఏపీలో జగన్ గెలుపుతో పీకేకు ఫుల్ గిరాకీ .. బెంగాల్కు రా రమ్మంటున్నా దీదీ
కోల్కత : అపార చాణక్యుడు ప్రశాంత్ కిశోర్ నెక్ట్స్ స్టెప్ ఏంటీ ? మోదీని గద్దెనెక్కించారు. ఇటు ఏపీలో జగన్కు అధికారం కట్టబెట్టేందుకు ఏకంగా రెండేళ్లు కృషిచేశారు. ఇప్పుడు అతని తదుపరి కార్యాచరణ ఏంటీ ? జేడీయూ నేతగా కొనసాగుతారా ? లేదంటే మరో పార్టీ విజయంలో కీ రోల్ పోషించే బాధ్యతలు స్వీకరిస్తున్నారా ? కిశోర చాణక్యంపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.
రాజయోగం తప్పనిసరి ..
ప్రశాంత్ కిశోర్ అడుగుపెడితే చాలు .. ఆ పార్టీ, అధినేతకు రాజయోగం తప్పనిసరి. గుజరాత్ సీఎంగా మోడీ, అటు నుంచి ప్రమోషన్ వచ్చి ప్రధాని పీఠం అధిష్టించిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో మోడీ తరఫున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేసి విజయంలో కీ రోల్ పోషించింది ఎవరూ కాదన్నా .. ఔనన్నా కిశోరే. తర్వాత కొన్నాళ్లు స్తభ్దుగా ఉండి రాహుల్తో కూడా వ్యుహాలు రూపొందించారు. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. తర్వాత ఏపీలో వైసీపీ అధినేత జగన్ కోసం రెండేళ్లు సమయం కేటాయించి ... విజయం సాధించడంలో ముఖ్యభూమిక పోషించారు. తర్వాత జేడీయూలో చేరినా .. రాజకీయ వ్యుహకర్త మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. అయితే ఏపీలో ప్రశాంత్ కిశోర్ వైసీపీ తరఫున పనిచేసే సమయంలో నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. దీంతో పీకే అంచనాలపై సందేహాలు వ్యక్తమయ్యాయి. చాణక్యం ఫలిస్తోందా అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ జగన్ మాత్రం పీకేను సంపూర్ణంగా విశ్వసించారు. గో అహెడ్ అంటూ ముందుకెళ్లే స్వేచ్చనిచ్చారు. దీంతో ఏపీలో వైసీపీ భారీ విజయానికి కారణమైంది. అయితే ఇప్పుడు దీదీతో కలిసి పనిచేయడం కూడా ఓ ప్రాధాన్యత ఉంది. ఇదివరకు ఏపీలో జగన్ తరఫున పీకే పనిచేశారు. దీదీ మాత్రం చంద్రబాబు తరఫున అదే ఏపీలో ప్రచారం చేశారు. కానీ ఏపీలో అనుసరించిన స్ట్రాటజీని బెంగాల్లో అప్లై చేయాలని దీదీ కోరడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి పీకే చాణక్యాన్ని కూడా దీదీ ఫాలో కావడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దీదీతో భేటీ ..
ఇది గడిచిన కిశోర్ చరిత్ర .. కానీ తాజాగా ఆయన టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. బెంగాల్లో బీజేపీ వర్సెస్ టీఎంసీ మధ్య అగ్గిరాజేసింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన సీట్ల కన్నా ఎక్కువ గెలవడంతో ఆ పార్టీ నేతల చేష్టలకు అంతేలేకుండా పోయింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేశారు దీదీ. ఈ క్రమంలోనే గురువారం రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ ఆమెతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
టీఎంసీ తరఫున రంగంలోకి ?
వచ్చే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం టీఎంసీ తరఫున ప్రశాంత్ కిశోర్ పనిచేస్తున్నాడా అనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో మొదలైంది. దాదాపు రెండుగంటలకుపైగా జరిగిన సమావేశంలో వివధ అంశాలపై సునిశీతంగా చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ భేటీలో అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొన్నారని టీఎంసీ వర్గాలు తెలిపాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వచ్చే నెల నుంచి దీదీతో కలిసి కిశోర్ పనిచేస్తారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
ముందే మేల్కొన్న దీదీ ...
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మరో రెండేళ్ల సమయం ఉంది. ఇప్పుడు మేల్కొంటే జరిగే నష్టాన్ని నివారించొచ్చని దీదీ భావిస్తున్నారు. అందుకే క్షేత్రస్థాయిలో ప్రజల నాడీ తెలుసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. అందుకోసమే ప్రశాంత్ కిశోర్ను తన రాజకీయ సలహాదారునిగా నియమించుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ విషయాన్ని అటు కిశోర్ గానీ ఇటు టీఎంసీ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే వచ్చేనెల నుంచి కలిసి పనిచేయబోతున్న నేపథ్యంలో .. త్వరలో కిశోర్ తమ రాజకీయ సలహాదారుడని టీఎంసీ ప్రకటించే అవకాశాలు పుష్పలంగా ఉన్నాయి.