మోడీకి దీదీ షాక్: కేంద్రంపై నిధులకు ఒత్తిడి, లేఖాస్త్రాలతో మమత మార్క్ బెంగాల్ రాజకీయం !!
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దీదీ వర్సెస్ మోడీ కొనసాగుతోంది. బెంగాల్ లో చోటుచేసుకున్న హింసపై నివేదిక పంపించాలంటూ,ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణనలోకి తీసుకోకుంటే తర్వాత పరిణామాలు వేరేగా ఉంటాయని కేంద్ర హోంశాఖ మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే లేఖాస్త్రం సంధించి దీదీకి షాక్ ఇచ్చింది. తానేమీ తక్కువ కాదంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మోడీని, కేంద్ర సర్కార్ ను టార్గెట్ చేస్తూ శరపరంపరలా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు.
ఎదురుదాడి మొదలుపెట్టిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వరుసగా ఎదురు దాడి మొదలుపెట్టారు.మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్స్ ఇవ్వాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి మమతా బెనర్జీ లేఖ రాశారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై లేఖ రాసిన మమతా బెనర్జీ కేంద్రం సాయం చేయాలని, ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్స్ ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత మరో లేఖాస్త్రాన్ని సంధించిన మమతా బెనర్జీ పిఎం-కిసాన్ పథకం కింద రైతులకు బకాయిలు చెల్లించడానికి నిధులు విడుదల చేయాలని కేంద్రానికి షాక్ ఇచ్చారు.
కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో సీఎం మమతాబెనర్జీ
ఇప్పటికే దేశంలో కరోనా ఉధృతితో సతమతమవుతున్న కేంద్ర సర్కార్ పై మమతా బెనర్జీ ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు. పిఎం-కిసాన్ పథకం కింద రైతులకు 18,000 రూపాయల చొప్పున నగదు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని గురించి ప్రధాని మోడీ తన బెంగాల్ పర్యటన సందర్భాన్ని గుర్తుచేస్తూ, రాష్ట్రానికి ఇంకా నిధులు అందలేదని ఆమె రాశారు. 21.79 లక్షల మంది రైతుల చెల్లింపులు చేసి తమతో ఆ వివరాలను పంచుకోవాలని ఆమె కోరారు.
గతంలో అనేకమార్లు సీఎం కిసాన్ పథకం కోసం లేఖలు రాశామని గుర్తు చేసిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ రైతులకు కేంద్ర పథకం యొక్క ప్రయోజనాలను అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్రానికి రాసిన లేఖలను పిఎం మోడీకి గుర్తు చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖకు కూడా అనేకమార్లు విజ్ఞప్తి చేశామని , కానీ వారు స్పందించలేదని వెల్లడించారు .గత నవంబర్లో పంపిన కేంద్ర వ్యవసాయ మంత్రి లేఖ ప్రకారం ఈ పథకం కోసం నమోదు చేసుకున్న 21.79 లక్షల మంది రైతులలో 14.91 లక్షల డేటా పోర్టల్లో నవీకరించబడింది, వీటిని సక్రమంగా ధృవీకరించారు . అందులో 9.84 లక్షల డేటా పిఎఫ్ఎంఎస్ కోసం సిద్ధంగా ఉందని కానీ ఇప్పటివరకు ఎవరికి లబ్ది చేకూరలేదన్నారు. చివరగా, కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు వ్యవసాయ రంగంలో పని చేస్తున్న చాలా మంది రైతులను మినహాయించాయని బెనర్జీ పేర్కొన్నారు.
పీఎం కిసాన్ క్రింద 21.79 లక్షల మంది రైతులకు నిధులివ్వాలని లేఖ
మోడీ ఇటీవలి రాష్ట్ర పర్యటనల సందర్భంగా ప్రతి రైతుకు పీఎం కిసాన్ క్రింద రూ .18,000 మొత్తాన్ని విడుదల చేస్తామని పదేపదే హామీ ఇచ్చారని పేర్కొన్న మమతా బెనర్జీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, రైతులకు కానీ ఎటువంటి నిధులు రాలేదు. అర్హులైన రైతులకు తగిన నిధులు విడుదల చేయాలని, 21.79 లక్షల మంది రైతులకు మేలు చెయ్యాలని సంబంధిత మంత్రిత్వ శాఖకు సలహా ఇస్తున్నాను అంటూ లేఖ రాశారు.అంతకుముందు డిసెంబరులో, బెంగాల్ సిఎం మమతా బెనర్జీ రాష్ట్రం ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న "కృషక్ బంధు" కేంద్రం ఇచ్చిన దానికంటే చాలా మంచిదని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో పీఎం కిసాన్ నిధులపై మోడీ వ్యాఖ్యలను గుర్తు చేసిన దీదీ
పశ్చిమ బెంగాల్కు సొంత పథకం ఉందని, కేంద్ర సహాయం అవసరం లేదని ఆ సమయంలో సిఎం మమతా బెనర్జీ నొక్కి చెప్పారు . మరోవైపు, మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం 70 లక్షల మంది రైతులను కేంద్రం యొక్క ప్రధాన పిఎం-కిసాన్ పథకం యొక్క ప్రయోజనాలను పొందకుండా ఆపి రాజకీయాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభల్లో ఆరోపించారు. ఇక ఈ నేపధ్యంలో తాజాగా పశ్చిమ బెంగాల్ లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్న మమతా బెనర్జీ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేసే పనిలో ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ వరుసగా దీదీ లేఖాస్త్రాలు , హోరాహోరీగా బెంగాల్లో సమరం
రాష్ట్రంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. పశ్చిమబెంగాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా టీఎంసీ కి బిజెపి కి మధ్య రసవత్తర రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. మమత పరిపాలనా వైఫల్యాన్ని దేశానికి తెలియజెయ్యాలని మోడీ సర్కార్, కేంద్రం తీరును దేశ వ్యాప్తంగా ఎండగట్టాలని మమతా బెనర్జీ ఒకరిమీద ఒకరు ఏ మాత్రం తగ్గకుండా హోరాహోరీ సమరమే చేస్తున్నారు.