అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి పోటీ చేస్తా .. మాజీ టీఎంసీ నేత సువేందు అధికారికి మమతాబెనర్జీ షాక్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన మాజీ సహాయకుడు సువేందు అధికారి కంచుకోట అయిన నందిగ్రామ్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం జరిగిన ర్యాలీలో నందిగ్రామ్ సీటు నుంచి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న కోరికను మమతా బెనర్జీ వ్యక్తం చేశారు.
నందిగ్రామ్ నుండి పోటీ చేస్తా
నందిగ్రామ్ ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, తాను టీఎంసి ప్రధాన కార్యదర్శి సుబ్రతా బక్షిని నందిగ్రామ్ సీటు తనకు కేటాయించాలని అభ్యర్థించాలనుకుంటున్నాను, ఇది తన కోరిక అంటూ పేర్కొన్నారు. అంతే కాదు తాను బబానిపూర్ ను నిర్లక్ష్యం చేయనని , అక్కడ సైతం బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. నందిగ్రామ్ పట్ల నాకున్న ప్రేమ వల్ల తాను నందిగ్రామ్ నుండి బరిలోకి దిగాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరడానికి ఇటీవల టిఎంసిని విడిచిపెట్టిన సువేందు అధికారికి తన వ్యాఖ్యలతో పెద్ద షాక్ ఇచ్చారు.
కొంతమంది అత్యాశతో పార్టీని వీడి వెళ్ళినా నష్టం లేదు
అంతేకాదు కొంతమంది టిఎంసి ని విడిచిపెట్టడం వల్ల కలిగిన నష్టం ఏమీ లేదని, అలాంటివాళ్లు వెళ్లిపోవడమే మంచిది అని అన్నారు మమతా బెనర్జీ .కొందరు ఇక్కడి నుండి అక్కడికి వెళుతున్నారు. వారు రానున్న ఎన్నికల్లో తప్పక ఓటమిపాలు అవుతారంటూ మమతా బెనర్జీ పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎవరు వెళ్లిపోయినా తమ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కొంతమంది అత్యాశతో ఉన్నారు, కాబట్టి వారు డబ్బుకు ఆశపడి భారతీయ జనతా పార్టీలో చేరారని మమతా బెనర్జీ అన్నారు .
రైతులకు అండగా తృణమూల్ కాంగ్రెస్
ఢిల్లీ నుండి బిజెపి నాయకులు తమను బెదిరించారని ఆరోపించారు. అయినా ఎవరికీ భయపడేది లేదని తేల్చి చెప్పారు. మమతా బెనర్జీ కేంద్ర వ్యవసాయ చట్టాలపై బిజెపిపై దాడి చేశారు. బిజెపి రైతులను దోచుకోవాలని కోరుకుంటుందని అన్నారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ, ఈ రోజు పంజాబ్లోని రైతులు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. తాము రైతులతో ఉన్నామని ,బిజెపి మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు .
మమతకు షాక్ ఇచ్చి బీజేపీ లో చేరిన సువేందు అధికారికి ఛాలెంజ్
మొత్తానికి మమతాబెనర్జీతో విబేధించి మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన సువేందు అధికారికి మమతా బెనర్జీ చాలెంజ్ విసిరి షాక్ ఇచ్చారు. 2007లో నందిగ్రామ్ నియోజకవర్గాన్ని సువేందు అధికారి చేజిక్కించుకుని లెఫ్ట్ కోటను తృణమూల్ కాంగ్రెస్ అడ్డాగా మార్చారు. ఇక ఇటీవల భారీ దళంతో బీజేపీలో చేరిన ఆయన మమతా బెనర్జీ షాక్ ఇవ్వడంతో, నందిగ్రామ్ నుండి పోటీ చేస్తానని ప్రకటించి మమతా బెనర్జీ సువేందు అధికారి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు .
రాబోయే ఎన్నికల్లో టీఎంసీకి 211 సీట్లు వస్తాయని ధీమా
రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) 211 సీట్లను గెలుచుకుంటుందని మమతా బెనర్జీ ఒపీనియన్ పోల్ ను ఉటంకిస్తూ పేర్కొన్నారు. 51 నియోజకవర్గాల్లో మాత్రమే బిజెపి గెలుస్తుందని మమతా బెనర్జీ తెలిపారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కారణంగా రాజకీయ వేడి రగులుకుంది .