సోనియాకు మమతా షాక్?: కేసీఆర్ 'థర్డ్ ఫ్రంట్' ఎఫెక్టా?..
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి షాకిచ్చారు. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే ప్రయత్నాల్లో భాగంగా.. ఈ నెల 13న సోనియాగాంధీ విందు పార్టీ ప్లాన్ చేశారు.
ఈ విందు కోసం మమతా బెనర్జీతో పాటు డీఎంకె స్టాలిన్, ఆర్జేడీ తేజస్వీ యాదవ్, మాజీ బీహార్ ముఖ్యమంత్రి జీతన్ రాంజీ మాంఝీ సహా పలువురు ప్రాంతీయ పార్టీల అధినేతలను ఆమె ఆహ్వానించారు.
అయితే ముందస్తు షెడ్యూల్ లో భాగంగా.. అదే రోజు డార్జిలింగ్లో జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండటంతో మమతా సోనియా విందుకు రావట్లేదని తృణమూల్ వర్గాలు చెప్పాయి. ఆమెకు బదులు పార్టీ నేతలు డెరెక్ ఒబ్రియన్, సుదీప్ బందోపాధ్యాయ్ ఆరోజు విందుకు హాజరవుతారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, మమతా బెనర్జీ సోనియా విందుకు డుమ్మా కొట్టడానికి కేసీఆర్ 'థర్డ్ ఫ్రంట్' కారణమా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్కు మమతా మద్దతు కూడా తెలిపారు. అయితే యూపీఏ లేని 'థర్డ్ ఫ్రంట్' సాధ్యం కాదనే ఆలోచనలో కూడా మమతా ఉన్నట్టు చెబుతున్నారు.
ఏదేమైనా సోనియా విందుకు మమతా డుమ్మా కొట్టడం ద్వారా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.