ఎన్నికల వేళ: మమతా బెనర్జీకి మరో షాక్: సువేందు అధికారితోపాటు మరో ఎమ్మెల్యే రాజీనామా, బీజేపీలోకి!
కోల్కతా: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా టీఎంసీకి సీనియర్ నేతలు గుడ్బై చెబుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా తన పదవికి రాజీనామా చేశారు.
సువేందు అధికారితోపాటు జితేంద్ర తివారీ కూడా రాజీనామా
ఇప్పటికే టీఎంసీలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు గురువారం మరో ఎమ్మెల్యే జితేంద్ర తివారీ కూడా ఎమ్మెల్యే పదవికి, టీఎంసీ పదవులకు రాజీనామా చేశారు. అసన్సోల్ మున్సిపల్ కొర్పొరేషన్ చీఫ్ పదవి నుంచి కూడా ఆయన వైదొలిగారు. అసన్సోల్కు వచ్చే కేంద్ర నిధులను మమత సర్కారు పక్కదోవ పట్టిస్తుందని ఆరోపించిన మరుసటి రోజే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.
టీఎంసీలో కీలక నేత సువేందు అధికారి..
కాగా, పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో సువేందు అధికారి రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే.. 2007లో తృణమూల్ పార్టీ అధికారంలోకి రావడానికి తూర్పు మిడ్నాపూర్లో జరిగిన నందిగ్రామ్ ఉద్యమమే ప్రధాన కారణం. ఆ ఉద్యమంలో సువేందు అధికారిదే కీలక పాత్ర. మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి ఆయన ఎంతో శ్రమించారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరితే.. మమతా బెనర్జీ టీఎంసీకి భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కీలక నేతల రాజీనామాలతో మమతకు మరో తలనొప్పి..
అసెంబ్లీ ఎన్నికలవేళ టీఎంసీలో కీలక నేతలుగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం ఇప్పుడు మమతా బెనర్జీకి కొత్త తలనొప్పిగా మారింది. వారిద్దరూ కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతుండటం గమనార్హం. వచ్చే రెండ్రోజుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్ పర్యటనకు రానున్నారని, ఆయన సమక్షంలోనే సువేందు అధికారి బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బీజేపీకి గెలుపు అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి. ఇక జితేంద్ర తివారీ కూడా కాషాయ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ఐపీఎస్ అధికారుల డిప్యూటేషన్పై కేంద్రంతో మమతా ఢీ
ఇది ఇలావుంటే, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పశ్చిమబెంగాల్లోని ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేంద్రానికి డిప్యూటేషన్పై పంపాలని కోరగా.. మమత సర్కారు అందుకు నిరాకరించింది. దీంతో మరోసారి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంపై లేఖ రాసింది. ఇప్పటికే వారికి కొత్త విధులు అప్పగించడం జరిగిందని.. వెంటనే వారిని రిలీవ్ చేయాలని కేంద్రం కోరింది. అయితే, కేంద్రం తీరు సరైనది కాదని, కక్ష పూరితంగా ఉందని మమత ఆరోపిస్తున్నారు.