హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్ చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరివురు నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
మే 2న జరిగిన ఓట్ల లెక్కింపు సందర్భంగా నందిగ్రామ్ కౌంటింగ్ సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలి 11 రౌండ్లలో సువేందు అధికారి వెనుకంజలో ఉన్నప్పటికీ.. తర్వాత నాలుగు రౌండ్లలో ఆయన అనూహ్యంగా పుంజుకున్నారు. ఓ దశలో ఏకంగా 11 వేల ఓట్ల తేడాతో ముందంజలో కొనసాగారు. దీనిపై దీదీ అనేక అనుమానాలు లేవనెత్తారు.
కౌంటింగ్ సమయంలో నాలుగు గంటల పాటు సర్వర్ డౌన్ అయ్యిందని.. ఆ సమయంలో అవకతవకలు జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. తాను గెలుపొందానని.. దానికి గవర్నర్ సైతం శుభాకాంక్షలు తెలియజేశారని పేర్కొన్నారు. ఒక్కసారిగా ఫలితాలన్నీ తారుమారయ్యాయని వాపోయారు. రీకౌంటింగ్ కోరినప్పటికీ ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు. దీంతో ఆమె మరింత అనుమానించారు.