దీదీతో డీల్ ఎఫెక్ట్ : ప్రశాంత్ కిషోర్తో తెగదెంపులు చేసుకున్న నితిశ్?
ఢిల్లీ : ప్రశాంత్ కిషోర్. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ పేరు సంచలనం. ఆయన రాజకీయ వ్యూహాలకు ప్రత్యర్థులు చిత్తు కావాల్సిందే. బీహార్లో లాలూ - నితీశ్ను ఏకతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో విజయ దుందుభి మోగించినా... ఏపీలో ప్రజలు జగన్కు తిరుగులేని మెజార్టీతో అధికారం కట్టబెట్టినా దాని వెనుకున్నది ఆయనే. అయితే తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ప్రశాంత్ను జేడీయూకి దూరం చేసినట్లు తెలుస్తోంది.
రంగంలోకి ఆర్ఎస్ఎస్.. రాజ్నాథ్కు పెరిగిన ప్రాధాన్యం
దీదీతో దోస్తీ తెచ్చిన తంటా
ప్రశాంత్ కిషోర్ స్వతహాగా జేడీయూ కార్యకర్త. వివిధ రాష్ట్రాల్లో పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగానూ పనిచేస్తున్నారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పనిచేసేందుకు ఆయన బెంగాల్ సీఎం మమత బెనర్జీతో డీల్ కుదుర్చుకున్నారు. దీనిపై ఆగ్రహంతో ఉన్న నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ప్రశాంత్ కిషోర్ను పార్టీ నుంచి సాగనంపే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
అదేం లేదంటున్న జేడీయూ
ప్రశాంత్ కిషోర్ను జేడీయూ నుంచి తప్పించనున్నారన్న వార్తల్ని ఆ పార్టీ ఖండించింది. ఈ ఊహాగానాల్లో ఎలాంటి నిజం లేదని పార్టీ అధికార ప్రతినిధి అజయ్ అలోక్ స్పష్టం చేశారు. ఎవరికి వ్యూహకర్తగా పనిచేయాలన్నది ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగత విషయమన్న ఆనయ.. దానితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇదే విషయాన్ని బీహార్ సీఎం నితీశ్ కుమార్ సైతం చెప్పారని అజయ్ తేల్చిచెప్పారు. ఇప్పటికి కూడా ఆయన పార్టీ వైస్ ప్రెసిడెంటేనన్న ఆయన.. జేడీయూ కోసం పనిచేయడం ప్రశాంత్కు ఇష్టం లేకపోతే ఎవరేం చేయగలరని అన్నారు.
ప్రశాంత్తో దీదీ డీల్
లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో ఊహించని రీతిలో బీజేపీ సీట్లు సాధించడంతో తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ ఆలోచనలో పడ్డారు. మరో రెండేళ్లలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్రమత్తమైన దీదీ.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో చర్చలు జరిపారు. దాదాపు రెండు గంటల సమావేశం అనంతరం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలో వైసీపీ ఘన విజయంతో ప్రశాంత్ కిషోర్ వ్యూహాల పట్ల ఆమె ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.