పిలిచి అవమానిస్తారా? ప్రధాని ముందే అలా జరిగింది: బీజేపీపై మమతా బెనర్జీ విమర్శలు
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాల్లో జై శ్రీరాం నినాదాలు చేయడం ద్వారా ఆయన గౌరవానికి భంగం కలిగేరీతిలో వ్యవహరించారని మండిపడ్డారు. బెంగాల్కు చిహ్నాలైన వ్యక్తులను తరచూ బీజేపీ అవమానిస్తోందని ఆరోపించారు. సోమవారం పర్సురాలో నిర్వహించిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు.
ఎవరైనా మీ ఇంటికి ఆహ్వానిస్తే.. ఆ వ్యక్తిని అవమానిస్తారా? ఇది బెంగాల్ సంస్కృతా? మనదేశ సంస్కృతా? నేతాజీని కొనియాడుతూ వారు నినాదాలు చేస్తే నేనూ హర్షం వ్యక్తంచేసేదాన్ని. కానీ, వాళ్లు అలా చేయలేదు. ఆ కార్యక్రమానికి సంబంధంలేని నినాదాలు చేసి నన్ను కించపర్చారు అంటూ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ దేశ ప్రధాని ముందే తాను అవమానానికి గురైనట్లు, ఇదీ బీజేపీ సంస్కృతి అంటూ ధ్వజమెత్తారు. కాగా, శనివారం నేతాజీ జయంతి వేడుకల సందర్భంగా విక్టోరియా మెమోరియల్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీతోపాటు సభలో పాల్గొన్నారు మమతా బెనర్జీ. అయితే, మమత మాట్లాడుతుండగా.. కొందరు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కోపం తెచ్చుకున్న మమత తనను అవమానపర్చారంటూ వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
కాగా, తమ పార్టీ నుంచి బీజేపీలోకి వెళుతున్న నేతలపైనా మమతా బెనర్జీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసినవారే పార్టీని వీడుతున్నారని, వారంతా పార్టీని వీడితేనే మంచిదని అన్నారు. లేదంటే తామే బయటికి పంపిస్తామన్నారు. అంతేగాక, ఇంకా ఎవరైనా వెళ్లిపోవాలనుకుంటే త్వరగా వెళ్లిపోవాలని మమతా బెనర్జీ సూచించారు. కాగా, టీఎంసీలో కీలక నేత అయిన సువేందు అధికారితోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.