Redzone రగడ: దీదీనా మాజాకా, 10 కాదు నాలుగే.. కేంద్రం జాబితాపై గుస్సా, లిస్ట్ పంపిన ఫైర్ బ్రాండ్
దీదీ మమతా బెనర్జీ మరోసారి ఫైరయ్యారు. ఈ సారి వైద్యారోగ్యశాఖ తీరును ఎండగట్టారు. దేశంలో వైరస్ ఎక్కువ ఉన్న జిల్లాలను రెడ్ జోన్, తక్కువ ఉన్న జిల్లాలను ఆరెంజ్ జోన్లు, ప్రభావం లేని జిల్లాలను గ్రీన్ జోన్గా విభజించిన సంగతి తెలిసిందే. అయితే పశ్చిమబెంగాల్లో 10 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయని ప్రకటించడం అగ్గిరాజేసింది. రాష్ట్రంలో 4 జిల్లాల్లో రెడ్ జోన్ అని మమతా దీదీ గుస్సా అయ్యారు.
బెంగాల్లో రెడ్ జోన్లు (19 హాట్ స్పాట్ సెంటర్లు) ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. 10 జిల్లాలని వైద్యారోగ్యశాఖ తెలుపడంతో అది తప్పు అని పశ్చిమబెంగాల్ సర్కార్ పేర్కొన్నది. అందులో తప్పులు ఉన్నాయని.. సరైన జాబితా పంపించాలని కోరింది. గురువారం వైద్యారోగ్యశాఖ కార్యదర్శితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో తప్పుడు విషయాలు ప్రస్తావించారని బెంగాల్ ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వివేక్ కుమార్ తెలిపారు. కోల్ కతా, హౌరా, ఉత్తర 24 పరగణ, పర్బా మెడినిపూర్ జిల్లాలు మాత్రమే రెడ్ జోన్ ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారమే కేంద్ర వైద్యారోగ్యశాఖకు ఆయన లేఖ కూడా రాశారు. లేఖతోపాటు రాష్ట్రంలో ఉన్న రెడ్ జోన్, ఆరంజ్ జోన్, గ్రీన్ జాబితాను కూడా జతపరిచారు. ఇది సరైన జాబితా అని ఆయన తేల్చిచెప్పారు.
130 రెడ్ జోన్లు, 284 ఆరంజ్ జోన్లు, 319 గ్రీన్ జోన్లుగా వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. అయితే జాబితా వారానికోసారి మారుతుందని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో మెట్రో పాలిటన్ నగరాలు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, హైదరాబాద్, బెంగళూరు రెడ్ జోన్లో ఉన్నాయి. కానీ బెంగాల్ ప్రభుత్వం మాత్రం కయ్యానికి మరోసారి కాలు దువ్వింది. తమ జాబితాను సరిచూసుకోవాలని కోరింది. ఇది బెంగాల్ వర్సెస్ కేంద్రం వార్గా మారే అవకాశం ఉంది.