అమ్మ, దీదీ ఎవరికి వారే: ఒకరిలా, మరొకరు అలా...
చెన్నై: భారతదేశంలో రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలకు అధినేత్రులుగా, ఎంతో కీలకమైన రాష్ట్రాలకు సీఎంలుగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరు కూడా భిన్నధ్రువాలుగా ఉంటారు. ఒకరు ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమైతే, మరొకరు మాత్రం ఆ పార్టీ మంత్రులు కూడా ఆమెతో మాట్లాడాలంటే ధైర్యం చాలదు.
ఇంతకీ వారిద్దరు ఎవరా? అని అనుకుంటున్నారా? ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తిరిగి రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న జయలలిత, మమతా బెనర్జీ. గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో తమిళనాడులో జయలలిత చరిత్ర సృష్టిస్తే, పశ్చిమ బెంగాల్లో మమత జయకేతనం ఎగురేశారు.
రబ్బరు చెప్పులు, సాదా జీవితం మమత సొంతం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీది విలక్షణ శైలి. బెంగాల్ ప్రజలు ముద్దుగా దీదీ అని పిలుస్తుంటారు. రబ్బరు చెప్పులు, సాదా చీర, నిరాడంబరతగా ఉంటారు. అత్యంత సాధారణంగా, నిరాడంబరంగా కనిపించేందుకే మమత ప్రాధాన్యతనిస్తారు. ఆమె ఎంత నిరాడంబరంగా ఉంటారో అంత ఉన్నతంగా ఆలోచిస్తారు. అంతకంటే ఉన్నతంగా ఆమె కార్యాచరణ ఉంటుంది.
పెద్దగా ఆస్తులు లేవు. అవినీతి ఆరోపణలు లేవు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంటారు. కమ్యూనిస్టుల అడ్డాగా ఉన్న పశ్చిమ బెంగాల్లో ఓ ఒంటరి మహిళ విజయం సాధించింది. సామాన్యులు సైతం మమతతో మాట్లాడేందుకు ఏమాత్రం భయపడని వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టించారు.
కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో కూడా సామాన్యమహిళగానే జీవించారు. తాను వెరీ ఇంపార్టెంట్ పర్సన్ని కాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమ బెంగాల్ విజయం ఆనంతరం కోల్కతాలో ఆమె మీడియాతో మాట్లాడారు.
తాను లెస్ ఇంపార్టెంట్ పర్సన్ (తక్కువ ప్రాధాన్యత కలిగిన వ్యక్తి) నని అన్నారు. తన లక్ష్యం ఢిల్లీ కాదని, రాష్ట్రానికి సేవ చేయడమే తనకిష్టమని అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రధాని పదవికి అభ్యర్థిగా నిలబడతారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, తానేదీ కోరుకోవడం లేదని అన్నారు.
తనకు చాలా మంది మిత్రులు ఉన్నారని, వారంతా తీసుకునే నిర్ణయంపై అది అధారపడి ఉంటుందని ఆమె చెప్పారు. దేశరాజకీయాల్లో చిన్న పాత్ర పోషిస్తున్న తనకు అత్యాశ మాత్రం లేదని ఆమె తెలిపారు. తన లక్ష్యం కేంద్రం కాదని, రాష్ట్రమని ఆమె స్పష్టం చేశారు.
తమ బాధలు తీర్చేందుకే మమత వచ్చారని పశ్చిమబెంగాల్ ప్రజలు విశ్వసించారు. అందుకే కమ్యూనిస్టుల కంచుకోటలను మమత బద్దలు కొట్టేందుకు బెంగాలీలు మద్దతిచ్చారు. మరోసారి దీదీకి పట్టం కట్టారు. మరో ఐదేళ్ల దీదీ అధికారంలో ఉంటారు.
జయలలితది విలక్షణమైన శైలి
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత తీరు ఎవరికీ అర్ధం కాదు. తమిళనాడు ప్రజలు ఆమెను 'పురుచ్చితలైవి' అని ముద్దుగా పిలుస్తుంటారు. ప్రజలకు అభీష్టం మేరకు ఎన్నో కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతుంటారు. నిత్యం ఆమె పథకాలు ప్రజల్లో ఉన్నప్పటికీ ఆమె మాత్రం పోయెస్ గార్డెన్ దాటి బయటకు రారు. అంతేనా అన్నాడీఎంకే మంత్రులకు కూడా అందుబాటులో ఉండరు.
అంతేకాదు ఎన్నికల్లో ఆమె ప్రచారం కూడా విభిన్నంగా ఉంటుంది. తమిళనాడు అన్నాడీఎంకే కార్యకర్తలకు 'అమ్మ' అంటే జయలలితే అనే భావన ఉంటుంది. ఆమెను ఒక దేవతలాగా కొలుస్తారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇటీవల ఎన్నికల సమయంలో ఆమె తన వాహనంలోనే ఉండి ప్రసంగిస్తారు. అయినా అమ్మ భక్తులు ఎంతో సంతోషంగా ఆమె ప్రసంగాన్ని ఆలకిస్తారు.
2011 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారు. అతి తక్కువ ధరకే మూడు పూటలా పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతో జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటిన్లు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాన్నే సృష్టించాయి. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు.
అంతేకాదు జయలలిత నివాసం పోయెస్ గార్డెన్లో ఆమె దర్శనం కోసం వేలాదిమంది ఎలాంటి విసుగు, విరామం లేకుండా వేచి చేస్తుంటారు. ఆమె బాల్కనీలో వచ్చి అభివాదం చేస్తే చాలు అన్నాడీఎంకే కార్యకర్తలు, అభిమానుల ఆనందానికి అవధులుండవు.
గురువారం ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత జయలలిత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంతోమంది నేతలు ఆమెకు చాలామంది పుష్పగుచ్ఛాలిచ్చి పాదాభివందనాలు చేశారు. ఆమె మెప్పును పొందాలని కోరుకుంటున్న కొందరు తమిళ నేతలు ఏకంగా సాష్టాంగ నమస్కారాలు చేశారు. వారందరి అభినందనలను చిరునవ్వుతో స్వీకరించిన జయలలిత, ఎంతో సంతోషంగా కనిపించారు.