మోడీని, నితీష్ల వెనుక ప్రశాంత్: 2016లో మమతకు?
ఢిల్లీ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీ గెలుపు వెనుక, 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెనుక... ఓ వ్యక్తి ఉన్నారు. అతనే ప్రశాంత్ కిషోర్. అతని వైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టి సారిస్తున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీ నేతృత్వంలోని బిజెపి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గుజరాత్లో మోడీ అభివృద్ధి చరిష్మాకు తోడు... ఎన్నికల సమయంలో పదునైన వ్యూహాలను ప్రశాంత్ కిషోర్ రచించారు.
దీంతో సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయ దుందుభి మోగించింది. లోకసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లేదా విపక్షాల విమర్శలకు ప్రశాంత్ కిషోర్... బిజెపికి ధీటైన వ్యూహాలు రచించారు. మోడీని చాయ్వాలా అనటంతో... బిజెపి చాయ్ పే చర్చాతో కౌంటర్ ఇచ్చింది.
నిన్నటికి నిన్న బీహార్ రాష్ట్రంలో మహాకూటమికి విజయాన్ని అందివ్వడంలో కిషోర్ ప్రశాంత్ పాత్ర ఎంతో ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి లేదా ఎన్డీయే కూటమికి పని చేసిన ప్రశాంత్.. బీహార్ ఎన్నికల్లో మహాకూటమి గెలుపుకు వ్యూహరచన చేశారు.
బీహార్ ఎన్నికలకు ముందు బిజెపి వర్సెక్ మహాకూటమి (కాంగ్రెస్, జెడీయూ, ఆర్జేడీ)గా కనిపించింది. కొన్ని సర్వేలు బిజెపి గెలుస్తుందని, మరికొన్ని సర్వేలు మహాకూటమి గెలుస్తుందని చెప్పాయి. కానీ ఫలితాలు మాత్రం ఏకపక్షంగా కనిపించాయి. బిజెపి చిత్తుగా ఓడింది.
నితీష్ - లాలూ - కాంగ్రెస్ గెలుపు వెనుక వ్యూహరచనలు చేసిన సూత్రధారి ప్రశాంత్ కిషోర్. 2014లో మోడీ, 2015లో నితీష్ గెలుపుకు వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిషోర్ వైపు మమతా బెనర్జీ దృష్టి సారిస్తున్నారు. రానున్న బెంగాల్ ఎన్నికల్లో తాను మరోసారి నెగ్గేందుకు ఆయన సేవలు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా మంచిపేరు సంపాదించుకున్న ప్రశాంత్ కిషోర్తో మమతా బెనర్జీ భేటీ కానున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వారం తర్వాత వారి భేటీ ఉండవచ్చంటున్నారు. వచ్చే ఏడాదిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి.
ఓటర్ల నాడి పట్టుకునేందుకు అవసరమైన టిప్స్, ప్రచార వ్యూహాలపై ప్రశాంత్ కిషోర్తో మమతా బెనర్జీ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. 37 ఏళ్ల ప్రశాంత్ ఉన్నత విద్యావంతుడు. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయన తన జట్టుతో కలిసి రూపొందించిన ఎన్నికల ప్రచార వ్యూహాలు ఎన్నో విజయవంతమయ్యాయి.