మోడీ! చంద్రబాబు గొంతు విన్నారా, ఇంకా అర్థం చేసుకోలే, శాస్తి తప్పదు: మమత నిప్పులు
కోల్కతా/న్యూఢిల్లీ: ఎన్డీయేకు శివసేన తర్వాత తెలుగుదేశం పార్టీ గట్టి షాకిచ్చింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని మోడీపై మండిపడ్డారు. ఆయనకు ప్రశ్న సంధించారు.
Recommended Video
ఈ రోజు తెలుగుదేశం కూడా మిమ్మల్ని వదిలి పెట్టిందని, వారి కేంద్రమంత్రులతో రాజీనామా చేయించారని, టీడీపీ, శివసేనలు మీ మిత్రపక్షాలను, వారు కూడా మీ పట్ల అసహనంతో ఉన్నారని చెప్పారు.
వారి గొంతు వింటున్నారా
నిన్న శివసేన, నేడు తెలుగుదేశం పార్టీ మోడీకి వ్యతిరేకంగా గళం విప్పారని, వారి గొంతు మీరు వింటున్నారా అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక వంటి రాష్ట్రాలు ఏం చెబుతున్నాయన్నారు.
బెంగాల్ గుణపాఠం చెబుతుంది
పశ్చిమ బెంగాల్ను లక్ష్యంగా పెట్టుకోవడం మీ వల్ల కాదని మోడీని ఉద్దేశించి మమత అన్నారు. బెంగాల్ మీకు సరైన గుణపాఠం చెబుతుందన్నారు. బెంగాల్లో అధికారంలోకి రావాలన్న తమ కల నెరవేరుతుందని బీజేపీ భావిస్తోందని, కానీ అది కలగానే మిగులుతుందన్నారు.
ఢిల్లీపై బెంగాల్దే గెలుపు
బెంగాల్లో బీజేపీ రావడం అంత సులభం కాదని మమతా బెనర్జీ చెప్పారు. దానికి బదులు బెంగాల్ ఢిల్లీ పైన గెలుస్తుందని చెప్పారు. ఇప్పటికీ మీరు బెంగాల్ను అర్థం చేసుకోలేదని బీజేపీని, మోడీని ఉద్దేశించి అన్నారు.
మరో ఫ్రంట్కు మమత సై
శివసేన తర్వాత టీడీపీ కేంద్రంపై అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో మమతా బెనర్జీ కూడా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. గత వారమే ఆమె కేసీఆర్తో మాట్లాడి థర్డ్ ఫ్రంట్కు సై అన్నారు.