ఎన్నికలకు ముందు పుల్వామా దాడి, మోడీ! ఏం చేశావ్: మమతా బెనర్జీ అనుమానాలు
కోల్కతా: కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పుల్వామా దాడి అనుమానాలను కలిగిస్తోందని ఆమె అన్నారు. అసలు పాకిస్తాన్ను అడ్డుకోవడానికి కేంద్రం ఇన్ని రోజులు ఏం చేసిందని నిలదీశారు.
లోకసభ ఎన్నికలకు ముందు దాడి, మమత అనుమానం
'మరికొద్ది రోజుల్లో లోకసభ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పుల్వామా తీవ్రవాద దాడి ఎందుకు జరిగింది. అసలు ఈ అయిదేళ్లు పాకిస్తాన్ పైన చర్యలకు కేంద్రం ఏం చేసింది' అని మమతా బెనర్జీ నిలదీశారు. ఎన్నికల నేపథ్యంలో మతఘర్షణలు సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేశాయా అని ఆమె మండిపడ్డారు.
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు
ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పైన షాడో యుద్ధానికి దిగిందని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన ఫోన్ను ట్యాపింగ్ చేస్తోందని కూడా మమత ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
పుల్వామా అటాక్: అందుకు ప్రతీకారంగా... పాకిస్తాన్ ఆర్మీ ఆసుపత్రి నుంచి అజహర్ ఆదేశాలు
గతంలోను ప్రశ్నల వర్షం
అంతకుముందు కూడా మమతా బెనర్జీ ప్రశ్నల వర్షం కురిపించారు. పుల్వామా దాడి నేపథ్యంలో... ఎన్ఎస్ఏ (నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ), ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. భద్రతాపరమైన ఇబ్బంది ఉన్నప్పుడు అన్ని వ్యాన్లు ఒకేసారి ఎందుకు వెళ్తున్నాయని మమత నిలదీశారు. కాగా, మమతా బెనర్జీ తీరుపై నెటిజన్లతో పాటు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.