బీజేపీపై పోరాటం చేసేందకు సీపీఐ, కాంగ్రెస్ కలిసి రావాలి: మమత బెనర్జీ
పశ్చిమ బెంగాల్ : బీజేపీతో పోరుకు సీపీఐ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కలిసి రావాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే పరిస్థితులు ఎలా తయారవుతున్నాయో భట్పారా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి రావడమంటే.. దానర్థం రాజకీయంగా ఒక్కటయ్యామని కాదని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో చాలా సమస్యలున్నాయని వాటిపై పోరాటం చేసేందుకు తమతో కలిసి రావాలని దీదీ పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలను క్రమశిక్షణలో ఉండాలని చెప్పడంలో తప్పులేదని.. అయితే క్రమశిక్షణ పేరుతో వారిని వేధింపులకు గురిచేయరాదని ఆమె అన్నారు.
ప్రభుత్వ పథకాల నుంచి ప్రజలకు అందాల్సిన డబ్బులను టీఎంసీ ప్రజాప్రతినిధులు తమ జేబుల్లోకి వేసుకుంటున్నారన్న ఆరోపణలు రావడంతో దీదీ స్పందించారు. డబ్బులను తగ్గించి ఇస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు హోరెత్తిన నేపథ్యంలో మమతా బెనర్జీ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడారు. కేవలం అధికారంలో ఉన్నామని తమ పార్టీ నేతలు ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ ఫలాలు తీసుకుంటున్నారని రుజువులు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని దీదీ అన్నారు.
Recommended Video
ఇక ఇదే సమయంలో మమతా బెనర్జీ బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ బెంగాల్లోకి విషసంస్కృతిని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. టీఎంసీకి కంచుకోటగా ఉన్న భట్పారాలో ఎన్నికల తర్వాత బీజీపీ టీఎంసీల మధ్య చాలా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.ఇక టీఎంసీ నుంచి బీజేపీలోకి అర్జున్ సింగ్ చేరిన తర్వాత ఈ హింసాత్మక ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. అర్జున్ సింగ్ బీజేపీ నుంచి పోటీచేసి బారక్పూర్ లోక్సభ స్థానంలో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం కిందికే భాట్పారా వస్తుంది. తప్పుడు వార్తలు ప్రచారం చేసి హింసను ప్రోత్సహించేవారిని గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని దీదీ హెచ్చరించారు.