పీకే స్కెచ్ తిరగబడింది.. బెంగాల్లో ప్రజా కాల్ సెంటర్కు టీఎంసీపై ఫిర్యాదులే ఎక్కువ..!!
కోల్కతా : పశ్చిమబెంగాల్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఓ ప్రత్యేక కాల్సెంటర్ను ఏర్పాటు చేశారు. "దీదీకే బోలో" అనే పేరుతో ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు ఏర్పాటు చేసిన ఈ కాల్సెంటర్కు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఏర్పాటు చేసిన కొన్ని గంటల్లోనే రాష్ట్ర నలుమూలల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
కాల్సెంటర్కు నాయకులపై ఫిర్యాదులు
రాష్ట్రంలోని సమస్యలపై కంటే ఈ మధ్యే సీపీఎం నుంచి తృణమూల్ కాంగ్రెస్లోకి ఫిరాయించి వారిపైనే ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నట్లు కాల్సెంటర్లో పనిచేసే వారు చెబుతున్నారు. ఈ కాల్స్ను కూడా సీపీఎం వారే చేస్తున్నట్లు వారు వెల్లడిస్తున్నారు. కొన్ని కాల్స్ మాత్రం నిజంగానే ప్రజల నుంచి వస్తున్నాయని వారుకూడా ఫిరాయింపుల గురించి ప్రశ్నిస్తున్నారని ఈ కాల్సెంటర్ టీమ్లో పనిచేస్తున్న సీనియర్ సభ్యుడు ఒకరు తెలిపారు. ఇక తృణమూల్ కాంగ్రెస్లోని పాతతరం నాయకులు నిజాయితీతో ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని అయితే ఈ మధ్యకాలంలో కొత్త తరం నాయకులు చేరారని వారంతా సిండికేట్లుగా ఏర్పడి దందాలు నడుపుతున్నారనే ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న పార్టీ నాయకులు, క్యాడర్ ప్రజలకు అందుబాటులో ఉన్నారనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉందని ఆ సీనియర్ సభ్యుడు చెప్పారు.
ఫిరాయింపులపై కూడా ఫిర్యాదుల వెల్లువ
ఇక కాల్ సెంటర్ ఏర్పాటు అయిన తొలిరోజున దాదాపు 700 మంది కొత్త టీఎంసీ క్యాడర్ పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వీరంతా అంకిత భావంతో పనిచేసే వారు కాదని ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు సమాచారం. అయితే ఇది పార్టీకి కొత్తే మీ కాదని ఓ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెబుతున్నారు. కొత్తగా వచ్చిన క్యాడర్ అప్పటికే పార్టీలో ఉన్న క్యాడర్ల మధ్య విబేధాలు తలెత్తడంతో గొడవలు జరుగుతున్న మాట వాస్తవమేనని ఆయన చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి రాకముందు ఏ పార్టీతో అయితే పదేళ్ల ముందు పోరాడామో అలాంటి నాయకులే నేడు పార్టీలోకి వచ్చారని ఆయన చెప్పారు. అయితే మమతా బెనర్జీ అన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని చెప్పారు.త్వరలోనే ఈ సమస్యలు సమిసిపోతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
గంటకు 17వేల నుంచి 18వేల కాల్స్
ఇదిలా ఉంటే తాను కూడా సీపీఎం నుంచి తృణమూల్ కాంగ్రెస్లోకి వచ్చిన వాడినేనని కూచ్ బెహార్ నాయకుడు చెప్పారు. తాను దీదీ పనితనం మెచ్చే పార్టీలోకి వచ్చినట్లు చెప్పిన ఆయన... పాత కార్యకర్తలు కొత్త కార్యకర్తలు అంటూ ఎవరూ లేరని వారి వ్యక్తిత్వంపై అంతా ఆధారపడి ఉంటుందన్నారు. అవినీతిలో కూరుకుపోయి ఉన్న చాలామంది తృణమూల్ కాంగ్రెస్ నేతలు పార్టీలోనే ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ఇది పాత క్యాడర్ కొత్త క్యాడర్ మధ్య కాదని అవినీతి అవినీతి రహిత వ్యక్తుల అంశంగా పరిగణించాలని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే దీదీకే బోలో కాల్ సెంటర్కు గంటకు 17వేల నుంచి 18వేలు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు ఐ-ప్యాక్ లెక్కలు చెబుతున్నాయి. ఇక రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల అమలుపై కూడా ఫిర్యాదులు అందుతున్నట్లు ఐప్యాక్ టీమ్ చెబుతోంది. అదే సమయంలో కొన్ని సలహాలు కూడా ప్రజలు ఇస్తున్నారని చెబుతోంది. ఆ సలహాలు సూచనలను తీసుకుని వాటిని ఎలా అమలు చేయాలనేదానిపై కూడా సర్కార్ కసరత్తు చేస్తోందని ఐప్యాక్ తెలిపింది.