ఆయుష్మాన్ భారత్ పై మమతాగ్రహం: పథకం నుంచి బెంగాల్ ప్రభుత్వం బయటకొస్తుందంటూ దీదీ ప్రకటన
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ మోడీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. మోడీ సర్కారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకంకు సంబంధించి క్రెడిట్ అంతా మోడీ కొట్టేస్తున్నారని ధ్వజమెత్తారు. అందులో రాష్ట్రాల సహకారం కూడా ఉందన్న సంగతి మోడీ ఎక్కడా ఎందుకు చెప్పడం లేదని ఆమె ప్రశ్నించారు.
ఆయుష్మాన్ భారత్ పథకంలో రాష్ట్రం వాటా కూడా ఉంది
బెంగాల్ ప్రజలకు ప్రతి ఇంటికి పోస్టాఫీసుల నుంచి లెటర్లు పంపుతున్నారని మండిపడ్డ మమతా... ఆయుష్మాన్ భారత్ పథకం వెనక తన కృషి ఎంతో ఉందని మోడీ చెప్పడం సరికాదని అన్నారు. పార్టీ కార్యక్రమాల కోసం ప్రభుత్వ సంస్థలను వినియోగించుకోవడాన్ని దీదీ తప్పుబట్టారు. మమతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్త్య సాథి ఆరోగ్య పథకంతో ఆయుష్మాన్ భారత్ పథకంలో విలీనం చేయడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం కంట్రిబ్యూట్ చేస్తోందని మమత గుర్తు చేశారు.
ఆయుష్మాన్ భారత్ నుంచి పశ్చిమ బెంగాల్ తప్పుకుంటుంది
ఆయుష్మాన్ భారత్ పథకంను మోడీ మాయచేసి చూపిస్తోందని అందులో అంతా డొల్లే కనిపిస్తున్న నేపథ్యంలో ఆ పథకం నుంచి బెంగాల్ ప్రభుత్వం విత్డ్రా చేసుకుంటోందని మమతా చెప్పారు. ఇక ఆయుష్మాన్ భారత్ పథకంకు మోడీ సర్కారే క్రెడిట్ తీసుకోవాల్సిందిగా మమతా సూచించారు. ఆయుష్మాన్ భారత్ పథకం జాతీయ ఆరోగ్య పథకం. ఇది 10 లక్షల మంది పేద ప్రజలకు, వారి కుటుంబాలకు రూ. 5 లక్షల వరకు మెడికల్ కవరేజ్ ఇస్తోంది. ఇదిలా ఉంటే 2017 నుంచి ఇదే తరహా పథకాన్ని బెంగాల్ ప్రభుత్వం అమలు చేస్తోంది. బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్వస్త్య సాథి పథకం కింద ఏడాదికి రూ.1.5 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విషయాల్లో కేంద్ర ప్రభుత్వం తలదూర్చడం సరికాదని మమతా మండిపడ్డారు. ఇప్పటి వరకు స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు సీబీఐ, ఆర్బీఐ, బ్యాంకుల్లో జోక్యం చేసుకున్నారని ఇప్పుడు ఎలా లూటీ చేయాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం పడిందని ఘాటు విమర్శలు చేశారు మమత.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రంలో పేర్లు మార్చిన మమత
అంతకుముందు కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను తమ రాష్ట్రంలో మారుస్తున్నట్లు మమతా చెప్పారు. స్వచ్చ్ భారత్ అభియాన్ పశ్చిమ బెంగాల్లో మిషన్ నిర్మల్ బంగ్లాగా మార్చడం జరిగిందని గుర్తుచేశారు. అంతేకాదు 'అజీవికా ' పేరును 'ఆనందధార' ' ప్రధానమంత్రి గ్రామజడక్ యోజన' పేరును 'బంగ్లార్ గ్రామీణ్ సడక్ యోజన'గా... 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన'ను 'బంగ్లార్ గృహ ప్రకల్ప 'గా మార్చడం జరిగింది. 'బేటీ బచావో బేటీ పడావో' పథకాన్ని కన్యశ్రీగా మార్చడం జరిగింది.