ఎన్ఆర్సీ భయంతో ఆరుగురు మృతి: బెంగాల్లో ఎన్ఆర్సీ ఉండదన్న మమతా
ప్రధాని మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాలను కలిసిన కొద్దిరోజుల తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మళ్లీ కమలం పార్టీపై కన్నెర్ర చేశారు. పశ్చిమ బెంగాల్లో ఎన్ఆర్సీ పేరుతో ప్రచారం చేస్తూ బీజేపీ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు పాల్పడుతున్న ఈ మానసిక హింసతో బెంగాల్లో ఆరుగురు మృతి చెందారని చెప్పారు. బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఆర్సీ అమలు చేయమని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
బెంగాల్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు కాదు
టీఎంసీ కార్యకర్తల సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. ఇప్పటికే అస్సాంలో ఎన్ఆర్సీ బారిన పడి చాలా మంది మృతి చెందారని ఆమె గుర్తు చేశారు. కేవలం ఆందోళన చెంది ఆరుగురు మృతి చెందడం తనను కలచివేసిందని మమతా చెప్పారు. ఎన్ఆర్సీ బెంగాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు కాదని ధీమా వ్యక్తం చేశారు. అస్సాం ఒప్పందం ప్రకారమే ఆ ఒక్కరాష్ట్రంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ పట్టికను తీసుకొచ్చారని చెప్పారు. కొందరు తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు బెంగాల్లో ఎన్ఆర్సీ అమలు చేస్తారని చెబుతున్నారని అలాంటి వారి మాటలకు కంగారు పడొద్దని మమతా పిలుపు నిచ్చారు.
హిందూ ముస్లింల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోంది
బీజేపీని లక్ష్యంగా చేసుకున్న మమతా కాషాయా నేతలు హిందూ ముస్లిం రాజకీయాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఇక ఎన్ఆర్సీ తుది జాబితాలో హిందువులు, ముస్లింలు, గుర్ఖాలు, హిందీ మాట్లాడే ప్రజల పేర్లను తొలగించారని ఆమె మండిపడ్డారు. బెంగాల్లో తాను ఉన్నంత వరకు ఎన్ఆర్సీ అమలు చేయలేరని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కేంద్రం ఎన్ఆర్సీ చేపట్టలేదని దీదీ వ్యాఖ్యానించారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం నింపారు. బెంగాల్లో నివసించే ప్రజలంతా ఈ రాష్ట్రం, దేశ పౌరులని మమతా చెప్పారు. పుకార్లను నమ్మరాదని మరోసారి పిలుపునిచ్చారు మమతా బెనర్జీ. పుకార్లు నమ్మి ఆత్మహత్యలకు పాల్పడరాదని మమతా బెనర్జీ కోరారు.
పుకార్లు నమ్మి ప్రాణాలు తీసుకోకండి
ఇక విలువైన గుర్తింపు కార్డులు, ఇతర డాక్యుమెంట్లు పోగొట్టుకున్నట్లయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పారు. బీజేపీ నేతలు చేసిన విషప్రచారంతో ఆరుగురు నిండు ప్రాణాలు పోయాయని వారి కుటుంబ సభ్యులను అడిగితే ఎన్ఆర్సీ బెంగాల్లో అమలు చేస్తామని చెప్పడంతోనే ప్రాణాలు తీసుకున్నారని చెబుతున్నట్లు మమతా వెల్లడించారు. ఇక మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మమతా బెనర్జీ మేనల్లుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ పరామర్శించారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
ఆర్థిక సంక్షోభంపై దృష్టి సారించండి
ఇదిలా ఉంటే దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, అదే సమయంలో ఉద్యోగాలు కూడా యువతకు లభించడం లేదని మండిపడ్డారు. దీనిపై దృష్టిసారించకపోతే తమ పార్టీ నిరసనకు దిగుతుందని హెచ్చరించారు. సెప్టెంబర్ 26న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బయట తమ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పారు. ఆ తర్వాతి రోజున కోల్ ఇండియా ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అక్టోబర్ 18న టీఎంసీ ర్యాలీ తీస్తుందని చెప్పారు మమతా. అందులో తాను కూడా పాల్గొంటుందని వెల్లడించారు.