జేపీ నడ్డా, విజయవర్గీయాల కాన్వాయ్పై రాళ్ల దాడి: డ్రామా అంటూ మమత, విచారణకు షా ఆర్డర్
కోల్కతా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్ నేత విజయవర్గీయల కాన్వాయ్పై జరిగిన దాడి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాజకీయ వేడిని మరింత పెంచింది. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కారుపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. మమతా కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు.
Recommended Video
బీజేపీ నేతల డ్రామా అంటూ మమతా బెనర్జీ..
దాడి ఘటనకు పాల్పడిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుంటే.. మమతా బెనర్జీ మాత్రం ఇదంతా కాషాయ పార్టీ నేతలు ఆడుతున్న డ్రామాగా అభివర్ణిస్తున్నారు. తమ ర్యాలీలకు ప్రజలను రప్పించుకునేందుకు ఇలాంటి నాటకాలు ఆడుతోందని విమర్శించారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ భద్రత ఉండగా, ఈ దాడి ఎలా జరిగిందని ఆమె ప్రశ్నించారు.
నేను ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ..: మమతా బెనర్జీ
తాను ఢిల్లీలో పర్యటించిన సమయంలో కూడా బీజేపీ ఇలాంటి నాటకాలు ఆడిందని మమతా బెనర్జీ ఆరోపించారు. తాను ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. తనను బీజేపీ శ్రేణులు గెరావ్ చేస్తాయని చెప్పుకొచ్చారు. వేగంగా వెళ్లిన కాన్వాయ్ కారణంగా ఒకరు గాయపడ్డారని, ఇందుకు సంబంధించిన వీడియోలు ఉన్నాయని టీఎంసీ చెబుతోంది.
అసలేం జరిగింది?
పశ్చిమ బెంగాల్లో 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో డైమండ్ హార్బర్ వద్ద బీజేపీ శ్రేణులను కలిసేందుకు వెళుతున్న సమయంలో జేపీ నడ్డా, కైలాష్ విజయవర్గీయాల కాన్వాయ్ పై టీఎంసీ కార్యకర్తలుగా పేర్కొంటున్నవారు దాడి చేశారు. అధికార టీఎంసీనే ఈ దాడులకు పాల్పడిందని బీజేపీ స్టేట్ చీఫ్ దిలీప్ ఘోష్ ఆరోపించారు. దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
దాడి ఘటనపై అమిత్ షా విచారణకు ఆదేశం
మరోవైపు, పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై రాళ్ల దాడికి పాల్పడిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్గా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దాడి ఘటనలకు సంబంధించి రెండు నివేదికలను కోరారు. రాష్ట్రంలోని శాంతి భద్రతలపై గవర్నర్ ను ఓ నివేదిక, ఘటనకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని అధికారులను మరో నివేదిక కోరారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లు ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. మమతా సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.