మమతా వర్సెస్ ఓవైసీ: వారి మాటలకు ప్రభావితం కావొద్దన్న దీదీ.. ఓవైసీ రివర్స్ అటాక్
పశ్చిమ బెంగాల్: సమాజంలో రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేలా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యవహరిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. అంతేకాదు మైనార్టీలు ఇలా రెచ్చగొట్టే వారి మాటలను నమ్మరాదంటూ చెబుతూ ఇదొక అతివాద చర్యగా ఆమె పేర్కొన్నారు. మమతా బెనర్జీకి తిరిగి కౌంటర్ ఇచ్చారు ఓవైసీ.
గులాబ్ ఖాన్ విడుదల: ఉగ్ర కేసుల్లో ముస్లింపై వివక్ష అంటూ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం
రెండు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు
బెంగాల్లోని కూచ్బెహార్లో ఓ ర్యాలీని ఉద్దేశిస్తూ మమతా బెనర్జీ ప్రసంగించారు. కూచ్ బెహార్ ప్రాంతం బంగ్లాదేశ్ భారత్కు సరిహద్దు జిల్లాగా ఉంది. అక్కడ బంగ్లాదేశ్ నుంచి అధిక సంఖ్యలో వలస వచ్చిన వలసదారులు ఉన్నారు. ఈ జిల్లాలో ఇదే ప్రధానాంశంగా ఉంది. రెండు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని చెప్పిన దీదీ... నేరుగా అసదుద్దీన్ ఓవైసీ పేరును ప్రస్తావించకుండా హైదరాబాద్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు.
మజ్లిస్ నేతల మాటలు నమ్మొద్దు: మమతా
మజ్లిస్ నేతలు రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు ప్రసంగాలు చేస్తున్నారని వారి మాటలకు నమ్మి మోసపోవద్దని మమతా బెనర్జీ చెప్పారు. వారు వేస్తున్న ఉచ్చులో చిక్కుకోవద్దని మమతా బెనర్జీ చెప్పారు. అదే సమయంలో హిందూ అతివాదుల గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ఇలాంటి వారిని నమ్మితే కలిసి ఉన్నవారు విడిపోవడం తప్ప మరొకటి కాదని చెప్పారు.
దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఓవైసీ
మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో ముస్లింల పరిస్థితి ఎలాగుందో మానవాభివృద్ధి సూచిక తెలియజేస్తుందని చెప్పారు. దేశంలో ముస్లింల పరిస్థితి ఇంత దారుణంగా ఎక్కడా లేదని ఆయన గుర్తు చేశారు. హైదరాబాదుకు చెందిన తమ లాంటి గుంపు గురించి బాధపడే మమతా బెనర్జీ ... లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ 18 సీట్లను ఎలా గెలిచిందో చెప్పాలని సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మమతా బెనర్జీ 2011 నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
2021లో పశ్చిమ బెంగాల్కు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే మమతా బెనర్జీ తనపై ఉన్న వ్యతిరేకతను రూపుమాపుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కమ్యూనిస్టులకు పట్టు ఉన్న బెంగాల్ రాష్ట్రం కాలక్రమంలో కమ్యూనిస్టులు కనుమరుగై పోతుండగా... దీదీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బలపడింది. ఇప్పుడు ఆరాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే 18 లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇదే ఇప్పుడు మమతా బెనర్జీని కలవరపాటుకు గురిచేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.