సీఏఏపై మమతా బెనర్జీ పుస్తకానికి మస్తు గిరాకీ.. ఆరు రోజుల్లోనే అన్నీ కాపీలు అమ్ముడుపోయాయట
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ రాసిన పుస్తకాన్ని పాఠకులు విపరీతంగా ఆదరించారని, ఆరు రోజుల వ్యవధిలోనే మొత్తం కాపీలు అమ్ముడుపోయాయని పబ్లిషర్లు వెల్లడించారు. కొల్ కతాలో 12 రోజులపాటు సాగిన 'ఇంటర్నేషనల్ కోల్ కతా బుక్ ఫెయిర్' ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా 'డే పబ్లిషర్స్' సంస్థ ప్రతినిధి అపూ డే.. సీఎం పుస్తకానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఫియర్ ఆఫ్ సిటిజన్షిప్
ఏటా కోల్ కతా బుక్ ఫెయిర్ సమయానికి మమతా బెనర్జీ ఏదో ఒక సబ్జెక్టుపై పుస్తకాలు రాయడం 1992 నుంచీ కొనసాగుతోంది. ఈసారి ఆమె సీఏఏపై 'నాగరిక్తా ఆటంకో(ఫియర్ ఆఫ్ సిటిజన్షిప్)' పేరుతో పుస్తకం రాశారు. దేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలను సీఏఏ ఎలా ప్రభావితం చేస్తుందో దీదీ తన పుస్తకంలో వివరించారు.
సీఏఏతో ఎవరికీ నష్టంలేదు: నఖ్వీ
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల భారతీయ ముస్లింలెవరికీ నష్టం జరగబోదని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. సీఏఏ వల్ల ముస్లింలు పౌరసత్వం కోల్పోతారంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నదంతా తప్పుడు ప్రచారమని, దాన్ని ప్రజలెవరూ నమ్మొద్దని ఆయన కోరారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లో మత పీడను ఎదుర్కోలేక భారత్ కు వచ్చిన మైనార్టీలకు పౌరసత్వం కల్పించేదే సీఏఏ అని, దీనిపై అనవసర అపోహలను నమ్మొద్దని మంత్రి అన్నారు.