సీన్ రివర్స్: ఇప్పుడు స్మగ్లర్లు గోసంరక్షకులను కాలుస్తున్నారు..అక్కడ జరిగింది అదే..!
హర్యానా: ఇప్పటి వరకు గోవులను తరలిస్తున్న వారిని గోసంరక్షకులు దాడి చేసి చంపేసిన ఘటనలను చూశాం. అయితే హర్యానాలో ఇందుకు భిన్నంగా జరిగింది. గోవులను స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ గోసంరక్షకుడిపై దాడి చేసి చంపారు. హర్యానా రాష్ట్రం పల్వాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని గోపాల్గా గుర్తించడం జరిగింది. ఈయన గోరక్షక్ సమితిలో సభ్యుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. గోవులను దొంగలించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న గోపాల్ ఆ గోవులను తరలిస్తున్న వాహనంను తన మోటార్ సైకిల్లో వెంబడించాడు.
జూలై 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వాహనంను చేజ్ చేస్తుండగా గోపాల్ను స్మగ్లింగ్ గ్యాంగ్ సభ్యులు తుపాకీతో కాల్చి హత్యచేశారు. వెంబడిస్తూనే ఫోన్ తీసి ఇతరులకు సమాచారం చేరవేస్తుండగా స్మగ్లర్లు గోపాల్ను కాల్చినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంకు చేరుకున్న పోలీసులు గోపాల్ మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. ఇదిలా ఉంటే గోవులను స్మగ్లింగ్ చేసే మాఫియానే గోపాల్ను హత్యచేశారని కన్నీరు మున్నీరయ్యారు మృతుడి కుటుంబ సభ్యులు.
ప్రాథమిక సమాచారం ప్రకారం గోపాల్ స్థానిక గోరక్షక సమితిలో చాలా క్రియాశీలకంగా ఉంటాడని తెలుస్తోంది. అయితే గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనంను వెంటపడుతుండగా అతన్ని స్మగ్లర్లు కాల్చేశారని గోపాల్ స్నేహితులు చెప్పారు. అయితే గోపాల్ హత్యతో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే రాజస్థాన్లోని అల్వార్లో జరిగిన మరో ఘటనలో జూలై 31న గోవులను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పట్టుకుని స్థానికులు చితకబాదినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు మొత్తం స్మగ్లర్ను చుట్టేయడంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో స్మగ్లర్తో పాటు మరో ఇద్దరి గ్రామస్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.