పందెం ఎంతో తెలుసా: 50 గుడ్లు తింటానంటూ సవాల్ చేసిన వ్యక్తి.. 41 గుడ్లకే ప్రాణాలు ఔట్.!
జాన్పూర్: కేవలం రెండువేలకు పందెం కాసి ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన ఉత్తర్ప్రదేశ్లోని జాన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. సుభాష్ యాదవ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి బీబీగంజ్ మార్కెట్కు వెళ్లాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా ఓ చిన్న విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదంకు దారి తీసింది. 50 గుడ్లు తినగలిగితే 2వేలు ఇస్తానని సుభాష్ యాదవ్కు తన మిత్రుడు ఛాలెంజ్ విసిరాడు. రూ.2వేల కోసం సవాలును స్వీకరించాడు సుభాష్.
సవాలును స్వీకరించిన సుభాష్ ఇక గుడ్లను తినడం ప్రారంభించాడు. ఒక్కొక్కటిగా తింటూ వచ్చాడు. ఇక గుడ్ల సంఖ్య 41కి చేరుకుంది. ఆ గుడ్డును కూడా తినేసి 42వ గుడ్డు తినబోయే ముందు ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు తరలించారు. చికిత్స పొందుతూ సుభాష్ యాదవ్ మృతి చెందాడు. సుభాష్ అన్ని గుడ్లు తినడంతోనే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సుభాష్ చనిపోయాడన్న సంగతి తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
ఇలా చిన్న చిన్న విషయాలను ఏదో ప్రెస్టీజియస్గా తీసుకుని ప్రాణాలు అనవసరంగా తీసుకుంటున్నారని మానసిక వైద్యులు చెబుతున్నారు. మనిషి ఈగో హర్ట్ అయిన సమయంలో తనపై తాను నియంత్రణ కోల్పోయి ఎలాంటి వాటికైనా సిద్ధపడిపోతాడని వారు చెబుతున్నారు. కేవలం 2వేల రూపాయలకు 50 గుడ్లు తింటాడని సవాలు స్వీకరించాడంటే అంతకుముందు వారిద్దరి మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదంలో సుభాష్ యాదవ్ ఈగో దెబ్బతిని ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమయంలో కొద్దిసేపు ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తే ప్రాణాలు పోయేవి కాదని అభిప్రాయపడుతున్నారు. ఆవేశం అన్ని వేళలా పనికిరాదనే సూక్తిని వారు గుర్తుచేశారు.
గతంలో కూడా బిరియానీలో ఒక చిన్న ముక్క తక్కువ పడిందని ఇద్దరి మిత్రుల మధ్య వాగ్వాదం ఏకంగా ప్రాణాలు తీసేసింది. ముక్క ఎందుకు తక్కువ వేశావని మరో మిత్రుడిని మొదటి వ్యక్తి ప్రశ్నించడంతో వారి మధ్య గొడవ ప్రారంభమై మొదటి వ్యక్తి ప్రాణాలను రెండో వ్యక్తి తీయడం జరిగిందనే విషయాన్ని గుర్తుచేశారు మానసిక నిపుణులు. వీటన్నిటికీ కారణం ఆవేశమే అని వారు చెబుతున్నారు.