'దృశ్యం' సినిమాలా: ప్రియురాల్ని చంపేశాడు, కానీ సీన్ రివర్స్
బెంగళూరు: కర్నాటకలోని బెంగళూరులో ఓ వ్యక్తి హత్య చేసి.. అచ్చం దృశ్యం సినిమాలో వలే బాగా మేనేజ్ చేసినప్పటికీ ఆ తర్వాత దొరికిపోయాడు. అతను హతమార్చింది తన ప్రియురాలిని. ఆ నేరం కప్పి పుచ్చుకునేందుకు దృశ్యం సినిమాని ఆదర్శంగా తీసుకున్నాడు.
ఆ సినిమాలోని సీన్లన్నింటిని బాగా పండించాడు. కానీ సీన్ రివర్స్ అయింది. సంవత్సరం పాటు పోలీసులను బురిడీ కొట్టించాడు. ఆ తర్వాత దొరికిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరస్థుడు అతనేనని గుర్తించారు. అప్పటికి గానీ ఆ ప్రేమోన్మాదికి తత్వం బోధపడలేదు.
బెంగళూరులోని గాంధీ క్రిషి విఘ్యాన్ కేంద్రలో చదువుతున్న అరుణ్, విజయపురలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న అర్పిత ప్రేమించుకున్నారు. కొద్ది రోజుల తర్వాత వీరి మధ్య విభేదాలు వచ్చాయి. దీనికి కారణం అరుణ్ పీహెచ్డీ చేసేందుకు వెళ్లడమే. అరుణ్ను పెళ్లి చేసుకోవాలని అర్పిత కోరింది. కానీ అరుణ్ ఆమె వినతిని పట్టించుకోలేదు.
పెళ్లి చేసుకోవాలని పదేపదే అర్పిత ఫోన్ చేసింది. దీంతో ఆమెను చంపితేనే తన సమస్య పరిష్కారం అవుతుందని అతను భావించాడు. ఆమెను హతమార్చాడు. ఆ తర్వాత కన్నడ దృశ్యంను చూశాడు. ఆ సినిమాలా సీన్లు పండించాడు.
సినిమా చూసిన అరుణ్.. తన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు హీరో చేసినట్లే చేయాలనుకున్నాడు. తన సెల్ఫోన్ను కావాలనే కాలేజీ హాస్టల్లో మరిచిపోయాడు. హత్య చేసిన రోజు కూడా కాలేజీకి వచ్చినట్లు అటెండెన్స్ను మార్చేశాడు. అలా చేస్తే తాను బెంగుళూరులోనే ఉన్నానని నమ్మించొచ్చని భావించాడు.
పోలీసుల విచారణలో హత్య జరిగిన తీరును అరుణ్ వివరించాడు. అర్పితకు ఫోన్ చేసి ధర్వాద్లో కలుసుకుందామని పిలిపించాడు. ఆటో లో వచ్చిన ఆమెను గబ్బుర్ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని కాల్చేశాడు. కానీ అది సగం కాలింది.
ఆ తర్వాత ఎవరికీ అనుమానం కలగకుండా ఉండేందుకు బెంగళూరుకు చేరుకున్నాడు. మూడు రోజుల తర్వాత ఆ పొలం యజమాని పొలానికి వెళ్లాడు. సగం కాలిపోయిన మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించాడు. ఆ మృతదేహం అర్పితకు చెందినదిగా పోలీసులు ధ్రువీకరించారు. ఈ హత్య 2015 జూన్ నెలలో జరగగా.. పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని చేధించారు.